వాషింగ్టన్: రెండు నెలల క్రితం చైనాలోని గ్వాంగ్జీ పర్వతాలలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ఏడాది మార్చి 21న చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్కు (China Eastern Airlines) చెందిన బోయింగ్ 737 విమానం (Boeing 737) కున్మింగ్ నుంచి గ్వాంగ్జౌకి వెళ్తుండగా కుప్పలింది. ఈ ప్రమాదంలో 9 మంది విమాన సిబ్బంది సహా మొత్తం 133 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదనని.. కావాలనే విమానాన్ని కూల్చివేశారని ప్రముఖ పత్రిక వాల్స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.
విమాన ప్రమాదం జరిగిన తర్వాత బ్లాక్ బాక్స్ నుంచి ఫ్లైట్ డేటా కాక్పిట్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని డీకొడ్ చేయగా కాక్పిట్లోని ఎవరో కావాలనే ఉద్దేశపూర్వకంగా జెట్ను కూల్చివేసినట్లు తెలుస్తుందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక వెల్లడించింది. విమానంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు గుర్తించలేదని అమెరికాకు చెందిన అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారని పేర్కొన్నది.
చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 విమానం మార్చి 21న మధ్యాహ్నం 1.11 గంటలకు కున్మింగ్ నుంచి గ్వాంగ్జౌకి బయలుదేరింది. మధ్యాహ్నం 3.05 గంటలకు గమ్యస్థానం చేరాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం 2.22 గంటలకు రాడార్ నుంచి విమానం మాయమైనట్లు ఫ్లైట్ డేటా ద్వారా తెలిసింది. ఆ సమయంలో విమానం 29,100 అడుగుల ఎత్తులో ఉండి 376 నాట్ల వేగంతో ప్రయాణించినట్లు ఫ్లైట్ డేటా ప్రకారం అంచనా వేశారు.
అనంతరం 2 నిమిషాల 15 సెకండ్లలో 26 వేల అడుగుల ఎత్తు కోల్పోయి 9,075 అడుగుల ఎత్తుకు చేరింది. మరో 20 సెకండ్లలో 3,225 అడుగుల ఎత్తుకు వచ్చి కిందనున్న వుజా గ్రామ సమీపంలోని కొండల్లో కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 133 మంది ఉన్నారు. వారిలో 129 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నారు. విమానం కూలిన ప్రాంతంలో భారీ మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. కాగా, గత 28 ఏండ్లలో చైనా ప్రధాన భూభాగంపై జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదమని అధికారులు తెలిపారు.