బీజింగ్, ఆగస్టు 4: తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్లో పర్యటించడంపై చైనా తీవ్ర ఆగ్రహావేశంతో ఉన్నది. ఈ క్రమంలో తైవాన్ జలసంధి పరిసరాల్లో బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. ఆర్మీ డ్రిల్ను పెద్దయెత్తున నిర్వహించింది.
తూర్పు తైవాన్ ప్రాదేశిక జలాల వైపునకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) పలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని, నిర్దేశిత లక్ష్యాలను ఆ క్షిపణులు కచ్చితత్వంతో చేధించాయని చైనా మిలిటరీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ డ్రిల్ నాలుగురోజుల పాటు కొనసాగుతుందన్నారు.
చైనా సైనిక విన్యాసాలపై తైవాన్ స్పందించింది. చైనా చర్యలు బాధ్యతారాహిత్యమని మండిపడింది. తాము ఎవరినీ రెచ్చగొట్టబోమని, అయితే తమ భూభాగాన్ని పరిరక్షించుకోవడంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టంచేసింది.