బీజింగ్, జూన్ 15: భూమి ఆవల జీవం ఉందా.. అనే విషయం ఎన్నో ఏండ్లుగా మానవులకు సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. చాలా దేశాలు విశ్వంలోకి సిగ్నల్స్ పంపి అక్కడ నుంచి ఏమైనా సంకేతాలు వస్తున్నాయా అని పరిశీలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా చేసిన తాజా ప్రకటన ఆసక్తిని రేకెత్తిస్తున్నది. తాము నిర్మించిన స్కైఐ అనే భారీ టెలిస్కోపు విశ్వంలో జీవాన్ని గుర్తించి ఉండవచ్చని చైనా ప్రభుత్వానికి చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ డెయిలీ పేర్కొన్నది. ఈ టెలిస్కోప్ విశ్వంలో నారో బ్యాండ్ ఎలక్ట్రోమాగ్నటిక్ సిగ్నల్స్ను గుర్తించిందని బీజింగ్ నార్మల్ యూనివర్సిటీ, చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బృందాలతో కలిసి పనిచేస్తున్న శాస్త్రవేత్త జియాంగ్ టాన్జే వెల్లడించారు.
అనుమానాస్పద సంకేతాలు, ఒక రకమైన రేడియో ఇంటర్ఫియరెన్స్ వంటివి గుర్తించామని దీనిపై మరింత పరిశోధించాల్సి ఉందని పేర్కొన్నారు. కానీ కొద్ది సేపటి తర్వాత ఆ రిపోర్టును, పోస్టులను వెబ్సైట్ నుంచి తొలగించారు. 2020 సెప్టెంబర్లో గయిఝౌ ప్రావిన్సులో స్కైఐ టెలిస్కోపును ప్రారంభించారు. 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండే దీనిని భూగ్రహం ఆవల జీవం ఉందో లేదో తెలుసుకొనేందుకు వినియోగిస్తున్నారు. ఇక్కడి బృందం 2020లో ఒకసారి,తాజాగా మరోసారి అనుమానాస్పద సంకేతాలను గుర్తించినట్టు జియాంగ్ పేర్కొన్నారు.