చైనా : వేగంలో విమానాలతో పోటీ పడేలా చైనా, జపాన్లు రైళ్లను తీర్చిదిద్దుతున్నాయి. తూర్పు ఆసియాలో గంటకు 370 మైళ్ల (600 కి.మీ.) వేగంతో ప్రయాణించే ఫ్లోటింగ్ రైళ్లు, వాణిజ్య విమాన ప్రయాణానికి పోటీగా హై స్పీడ్ రైలును నిలబెడుతున్నాయి. ఈ సాంకేతిక పురోగతిలో చైనా, జపాన్ ప్రధాన కేంద్రంగా ఉన్నాయి. ఒక వాణిజ్య విమానం గంటకు 550 మైళ్ల(885 కి.మీ.) వేగంతో ప్రయాణిస్తుండగా, మ్యాగ్లెవ్ రైలు గంటకు దాదాపు 370 మైళ్ల వేగంతో దూసుకెళ్తూ ఎగురుతున్న అనుభూతిని ఇస్తున్నది. ఇది గంటకు 217 మైళ్ల(350 కి.మీ.) వేగంతో వెళ్లే సాధారణ హై స్పీడ్ రైలు వేగానికి పూర్తి భిన్నమైనది.
సాంప్రదాయ బుల్లెట్ రైళ్లు, విమానయాన రంగం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడానికి చైనా ప్రభుత్వ మద్దతు ఉన్న తయారీదారు సీఆర్ఆర్సీ గంటకు 370 మైళ్ల వేగంతో వెళ్లే మాగ్లెవ్ రైలు ప్రోటోటైప్ను ప్రదర్శించింది. విద్యుదయస్కాంత సస్పెన్షన్పై నడిచే ఈ రైలు యాంత్రిక ఘర్షణ లేకుండా గైడ్ ట్రాక్కంటే కొద్ది మిల్లీమీటర్ల ఎత్తులో సునాయాసంగా తేలుతూ వెళ్తుంది. గరిష్ఠ వేగంతో ఇరుకైన పర్వత మార్గాల్లోకి ప్రవేశించేటప్పుడు ఏర్పడే ‘టన్నెల్ బూమ్’ గాలి ఒత్తిడిని నివారించడానికి పోరస్, షాక్ అబ్జార్బింగ్ టన్నెల్ బఫర్లను రూపొందించడం వంటి సంక్లిష్టమైన ఏరోడైనమిక్ సవాళ్లను చైనా ఇంజినీర్లు అధిగమించారు. రద్దీ ఎక్కువగా ఉండే బీజింగ్ నుంచి షాంఘై కారిడార్లో ఈ 370 మైళ్ల మాగ్లెవ్ను అందుబాటులోకి తెస్తే, ప్రయాణ సమయం సుమారు 4 గంటల నుంచి 2.5 గంటలకు తగ్గుతుంది. ఇది కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తూనే డోర్-టు-డోర్ ఫ్లైట్ సమయాలకు సరిసమానంగా ఉంటుంది.
షింక్యాన్సెన్తో ఆధునిక బుల్లెట్ రైళ్లను ప్రారంభించిన జపాన్, తన చువో షింక్యాన్సెన్ లైన్తో దీనికి పోటీనిస్తున్నది. సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెటిక్ లెవిటేషన్ సాంకేతికతపై నిర్మించబడిన జపనీస్ టెస్ట్ రైళ్లు, ప్రయోగాత్మక ట్రాక్లపై గంటకు 375 మైళ్ల (603 కి.మీ.) రికార్డు వేగాన్ని అందుకున్నాయి. టోక్యో, నాగోయా, ఒసాకా నగరాలను అనుసంధానించేలా డిజైన్ చేసిన జపాన్ సిస్టమ్, అత్యల్ప ఉష్ణోగ్రతలకు చల్లబరిచిన శక్తివంతమైన నియోబియం-టైటానియం అయస్కాంతాలను ఉపయోగిస్తున్నది. ఇది 10 సెంటీమీటర్ల గ్యాప్లో తేలుతూ ప్రయాణిస్తుంది. స్థిరమైన లెవిటేషన్ను సాధ్యం చేస్తుంది. ఈ లైన్ ద్వారా టోక్యో నుంచి నాగోయా ప్రయాణం కేవలం 40 నిమిషాలకు, టోక్యో నుంచి ఓసాకాల మధ్య ప్రయాణ గంటకు తగ్గుతుంది.