చైనా పాలకులు ఎంత ఒత్తిడి చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, టిబెట్ ప్రజలు తమ వ్యవహారాల నుంచి దూరం జరిగిపోలేదని టిబెట్ మత గురువు దలైలామా పేర్కొన్నారు. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా… టిబెట్ ప్రజల మానసిక పరిస్థితి ఇసుమంతైనా మారిపోలేదని దలైలామా ప్రశంసించారు. అమెరికా ప్రతినిధి ఉజరా జెయా ఆధ్యాత్మిక గురువు దలైలామాతో ధర్మశాలలో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా దలైలామా అమెరికా, భారత్ను ఎంతో మెచ్చుకున్నారు.
ఈ సందర్భంగానే దలైలామా టిబెట్ వ్యవహారాన్ని ఉటంకిస్తూ.. పై వ్యాఖ్యలు చేశారు. చైనాలో ఉన్నది కమ్యూనిస్టు ప్రభుత్వమైనా… చైనా చైనాలాగా లేదని, అస్తిత్వాన్ని కోల్పోయిందని, మార్క్సిజం వీసమెత్తైనా లేదంటూ దలైలామా విమర్శించారు. ఈ సందర్భంగా చైనాలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులపై చర్చించారు.
అయితే మానవత్వంలో, ప్రజాసామ్య ఆచరణలో అటు అమెరికా, ఇటు భారత్ రెండూ అద్భుతంగా ఉన్నాయని, ఈ దేశాల్లో స్వేచ్ఛ ఎక్కువని దలైలామా అన్నారు. సార్వత్రిక విలువల పెంపు, మత సామరస్యాన్ని పెంపొందించడం, టిబెట్ సంస్కృతి, పర్యావరణ రక్షణ, ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని తిరిగి పునరుద్ధరించడం అన్న నాలుగు అంశాలకు తాను ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని దలైలామా పేర్కొన్నారు.