వియన్నా: చెర్నోబిల్ అణు విద్యుత్తు కేంద్రం నుంచి తమకు ట్రాన్స్మిషన్ డేటా అందడం లేదని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్లో ఉన్న చెర్నోబిల్ అణు కేంద్రాన్ని రష్యా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అక్కడ పనిచేస్తున్న మానిటరింగ్ సిస్టమ్ నుంచి తమకు డేటా అందడంలేదని, అవి ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయో తెలియడంలేదని యూఎన్ అటామిక్ వాచ్డాగ్ పేర్కొన్నది. అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్ రఫేల్ గ్రోసీ దీనిపై మాట్లాడుతూ. చెర్నోబిల్లో ఇన్స్టాల్ చేసిన మానిటరింగ్ సిస్టమ్స్ నుంచి డేటా ట్రాన్స్మిషన్ జరగడం లేదని తెలిపారు. ఫిబ్రవరి 24వ తేదీన చెర్నోబిల్ కేంద్రాన్ని రష్యా ఆధీనం చేసుకున్నది. ఉక్రెయిన్లో ఉన్న ఇతర అణు కేంద్రాల్లోని మానిటరింగ్ వ్యవస్థలను కూడా పరీక్షిస్తున్నట్లు యూఎన్ ఏజెన్సీ తెలిపింది. చెర్నోబిల్ కేంద్రంలో 200 మంది టెక్నికల్ స్టాఫ్, గార్డులు ఉన్నారు. 13 రోజుల నుంచి వాళ్లు అక్కడే పనిచేస్తున్నారు. వారి పరిస్థితి దయనీయంగా ఉన్నట్లు అటామిక్ ఏజెన్సీ తెలిపింది. అయితే వర్కర్లను రొటేట్ చేయాలని యూఎన్ ఏజెన్సీ రష్యాను కోరింది. చెర్నోబిల్ సైట్ రక్షణ కోసం సిబ్బందికి రెస్ట్, రెగ్యులర్ షిఫ్ట్లు అవసరమని ఏజెన్సీ తెలిపింది.