న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16 : ఖతార్లో హమాస్ నాయకులపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ఐక్యంగా స్పందించిన అరబ్, ఇస్లామిక్ దేశాలకు చెందిన పలువురు నాయకులు సోమవారం దోహాలో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టడంపై తీసుకోవలసిన చర్యల విషయంలో నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ అరబ్ సైనిక కూటమి ఏర్పాటుపై మాత్రం వారు ఏకాభిప్రాయానికి వచ్చారు. అరబ్ ప్రపంచంలో అతి పెద్ద సైనిక పంపత్తి గల ఈజిప్టు ఈ అరబ్ సైనిక కూటమికి అరబ్ నాటో అని నామకరణం చేయగా, దోహాలో జరిగిన అత్యవసర సమావేశానికి పాకిస్థాన్, తుర్కియే కూడా హాజరయ్యాయి. అణ్వస్ర్తాలు గల ఏకైక ముస్లిం దేశమైన పాకిస్థాన్ ఈ అత్యవసర సమావేశంలో పాల్గొనడంతోపాటు ఇజ్రాయెలీ కుట్రలను కనిపెట్టేందుకు ఓ ఉమ్మడి టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్ని ఆర్థికంగా దెబ్బతీయాలని తుర్కియే అధ్యక్షుడు తయ్యీప్ ఎర్డోగన్ ఈ సమావేశంలో సూచించారు. నాటో తరహాలో అరబ్, ఇస్లామిక్ దేశాలు ఉమ్మడి భద్రతా వ్యవస్థను నిర్మించుకోవాలని ఇరాక్ ప్రధాని మొహమ్మద్ సుడానీ కోరారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 34 దేశాల ఇస్లామిక్ కూటమి ఏర్పాటుకు సౌదీ అరేబియా గతంలోనే ప్రతిపాదించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా తన మిత్రదేశాలతో భద్రతా ఒప్పందాలను పునఃపరిశీలిస్తున్న తరుణంలో ఈ తాజా పరిణామం చోటుచేసుకోవడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈజిప్టు రాజధాని కైరోలో అరబ్ నాటో ప్రధాన కార్యాలయం ఉండాలని ఈజిప్టు ప్రతిపాదిస్తోంది. ఉమ్మడి సైన్యం కోసం తమ వంతుగా 20,000 మంది బలగాలను సమకూర్చడానికి ఈజిప్టు సంసిద్ధత తెలిపింది. ఉమ్మడి బలగాలకు తొలి కమాండర్గా ఈజిప్టుకు చెందిన ఫోర్ స్టార్ జనరల్ ఉండాలని కూడా ఈజిప్టు ప్రతిపాదించింది. 22 అరబ్ లీగ్ సభ్యుల మధ్య సైనిక నాయకత్వం పరిభ్రమిస్తుంటుందని, భూమి, వాయు, నౌకాదళానికి చెందిన సేనలతోపాటు కమాండో యూనిట్లు ఇందులో భాగమై ఉంటాయని, వాటికి సమగ్ర శిక్షణతోపాటు లాజిస్టిక్స్ కూడా ఉమ్మడిగా సమకూర్చుకోవడం ఉంటుందని ఈజిప్టు ప్రతిపాదించింది. డిప్యూటీ కమాండ్ బాధ్యతను నిర్వహించడానికి సౌదీ అరేబియా ఆసక్తిని కనబరుస్తోంది. యూఏఈ, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలు నిధుల సమీకరణ, అధునాతన ఆయుధ సంపత్తి సేకరణ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. తమ అరబ్ నాటో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఆత్మరక్షణ ఛత్రంగా పనిచేస్తుందే తప్ప ప్రతిఘటన కూటమిగా కాదని ఈ సమావేశంలో పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: గాజా నగరంలో గ్రౌండ్ ఆపరేషన్ కోసం ఎంతోకాలం నుంచి వేచి చూస్తున్న ఇజ్రాయెల్ మంగళవారం ఆపరేషన్ ప్రారంభించినట్లు వెల్లడించింది. గాజా తగలబడుతోంది అని ప్రకటించిన ఇజ్రాయెల్.. గాజా నగరంలోని హమాస్ ఉగ్రవాద స్థావరాలను ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్) ధ్వంసం చేయడం మొదలుపెట్టినట్లు తెలిపింది.గాజా నగరంలో నివసిస్తున్న వేలాదిమంది పౌరులు తమ ఇళ్లను వదిలి పారిపోవాలని ఐడీఎఫ్ ఆదేశించింది. హమాస్ను అంతం చేసి బందీలను విడిపించుకోవడానికి ఐడీఎఫ్ సైనికులు పోరాటం సాగిస్తున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. గాజా తగలబడుతోందని ఆయన ప్రకటించారు. గాజాలో కీలకమైన ఆపరేషన్ ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.