న్యూఢిల్లీ: కాంబోడియా-థాయిలాండ్ సరిహద్దులోగల పోయిపేట్లోని గ్రాండ్ డైమండ్ సిటీ హోటల్ క్యాసినోలో బుధవారం అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకే పెరుగుతున్నది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 19కి చేరింది. దాదాపు 120 మందికి పైగా ఈ ప్రమాదంలో గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని కాంబోడియా అధికారులు తెలిపారు.
క్యాసినో నిర్వహిస్తున్న ఆ హోటల్లో ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 1000 మందికి పైగా ఉన్నట్లు అక్కడి అధికార యంత్రాంగం ప్రకటించింది. బుధవారం రాత్రి 11.30 గంటలకు ప్రమాదం జరుగగా.. థాయ్ రెస్క్యూ టీమ్స్ ఘటనా ప్రాంతానికి చేరుకోవడానికి తెల్లవారుజామున ఏడు అయ్యింది. మొత్తం 360 మంది రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మంటలను ఆర్పడానికి 11 ఫైరింజన్లను వినియోగించారు. ప్రమాదం నుంచి మొత్తం 700 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు.
ప్రమాదం సమయంలో పరిసర ప్రాంతాలను దట్టమైన పొగ కమ్మేసిందని, పెద్దఎత్తున మంటలు ఎగిసిపడటంతో హోటల్లో చిక్కుకున్న వారు ప్రాణభయంతో ఆర్తనాదాలు చేశారని, కొందరు ప్రాణాలను కాపాడుకోవడానికి హోటల్ నుంచి బయటికి దూకి తీవ్ర గాయాలపాలయ్యారని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం థాయ్లోని వివిధ ఆస్పపత్రుల్లో 79 మంది థాయ్ దేశీయులు, 30 మంది కాంబోడియన్లు, 8 మంది ఇండోనేషియన్లు చికిత్స పొందుతున్నట్లు థాయ్ విదేశాంగ శాఖ వెల్లడించింది.
కాగా, ఆగ్నేయాసియాలోని అత్యంత పేద దేశాలలో కాంబోడియా ఒకటి. ఆ దేశ పౌరులు క్యాసినో ఆడటాన్ని అక్కడి ప్రభుత్వం నిషేధించింది. కానీ, థాయ్ సరిహద్దుల్లో అనేక హోటళ్లలో క్యాసినోలు విచ్చలవిడిగా అడుతుంటారు. ప్రస్తుతం అగ్నిప్రమాదం సంభవించిన పోయిపెట్ హోటల్ క్యాసినో ఆడేందుకు సెలవు రోజుల్లో పెద్ద సంఖ్యలో చేరుకుంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అగ్నిప్రమాదం జరగడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.