లండన్, ఫిబ్రవరి 15: ఎన్నికల వేళ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. యూకే క్రమంగా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనబోతున్నది. 2023 చివరి త్రైమాసికం ఆర్థిక మాంద్యంలోకి వెళ్లింది. ఈ మూడు నెలల్లో యూకే జీడీపీ 0.3 శాతం తగ్గినట్టు బ్రిటన్ జాతీయ గణాంక శాఖ తెలిపింది. ఈ పరిస్థితికి పారిశ్రామిక ఉత్పత్తి, నిర్మాణ రంగం, సేవల్లో స్తబ్ధత ఏర్పడటమే కారణమని విశ్లేషిస్తున్నారు.
ఆర్థిక వేత్తలు అంచనా వేసినట్టుగా జీడీపీ క్షీణత 01 శాతం కన్నా ఎక్కువగా నమోదు కావటం గమనార్హం. వరుసగా రెండు త్రైమాసికాల్లో జీడీపీ నెమ్మదిస్తే దాన్ని మాంద్యంగా పేర్కొంటారు. బ్రిటన్ జీడీపి అంతకుముందు త్రైమాసికంలో కూడా 0.1 శాతం తగ్గింది. చివరి త్రైమాసికంలో కూడా తగ్గుదల నమోదైంది. 2020లో ఒకసారి ఇలాగే బ్రిటన్ ఆర్థిక మాంద్యంలోకి వెళ్లింది.
ఇప్పుడు అదే పునరావృతం అయ్యింది. బ్రిటన్ అధికార పార్టీ అయిన కన్సర్వేటివ్ పార్టీపై ఆర్థిక మాంద్యం పెద్ద ప్రభావాన్నే చూపనున్నది. ఈ సంవత్సరంలోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఎన్నికల తేదీ ఇంకా నిర్ణయించలేదు. దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన రుషి సునాక్కు ఇది నిజంగా ఇబ్బంది కలిగించే అంశమే.