బోరిస్పై తీవ్ర నైతిక వర్తన ఆరోపణలు
భారత సంతతి ఎంపీకే ఎక్కువ అవకాశాలు
వచ్చే అక్టోబర్లో కొత్త ప్రధాని ఎన్నిక
లండన్, జూలై 7: తీవ్రమైన నైతిక వర్తన ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి ఎట్టకేలకు రాజీనామా చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘన, ఓ రేపిస్టు ఎంపీని కీలక పదవిలో నియమించటం ఆరోపణలతో కొద్దిరోజులుగా బోరిస్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రధాని పదవి నుంచి బోరిస్ దిగిపోవాలంటూ సొంత ప్రభుత్వంలోని మంత్రులే వరుసగా రాజీనామాలు చేయటంతో సంక్షోభం మరింత ముదిరింది. దీంతో గురువారం ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన వారసుడిని వచ్చే అక్టోబర్లో ఎన్నుకొంటారు. అప్పటివరకు బోరిస్ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు. బ్రిటన్ కొత్త ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్ ముందు వరుసలో ఉన్నారు. ఈయన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు.
భారతదేశాన్ని 200 ఏండ్లపాటు నిరంకుశంగా పాలించిన బ్రిటన్కు ఇప్పుడు ఓ భారత సంతతి వ్యక్తి ప్రధాని అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అనేక ఆరోపణలతో గురువారం రాజీనామా చేసిన బోరిస్ జాన్సన్ స్థానంలో మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్ (42) బ్రిటన్ ప్రధాని పగ్గాలు చేపట్టే అవకాశాలు అధికంగా ఉన్నాయని ప్రచారం జరుగుతున్నది. రిషి పూర్వికులు పంజాబ్కు చెందినవారు. వారు మొదట ఉత్తర ఆఫ్రికా వలస వెళ్లి, అటు నుంచి బ్రిటన్కు వచ్చి స్థిరపడ్డారు. రిషి తల్లి ఫార్మసిస్టు కాగా, తండ్రి బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్)లో జనరల్ ప్రాక్టిషనర్గా సేవలందిస్తున్నారు. రిషి ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్య అభ్యసించారు. కాలేజీలో చదువుతున్నప్పుడే ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూతురు అక్షతామూర్తిని రిషి ప్రేమించి పెండ్లి చేసుకొన్నారు. వీరికి కృష్ణ, అనుష్క అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రిషి 2015లో యార్క్షైర్లోని రిచ్మండ్ నుంచి తొలిసారి కన్సర్వేటివ్ పార్టీ ఎంపీగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగటానికి సంబంధించిన బ్రెగ్జిట్ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. బ్రెగ్జిట్ ఉద్యమానికి నాయకత్వం వహించిన బోరిస్ జాన్సన్కు ప్రధాన మద్దతుదారుడిగా అవతరించారు. బోరిస్ ప్రధాని పగ్గాలు చేపట్టగానే రిషిని ప్రభుత్వంలోకి తీసుకొన్నారు. 2020లో బ్రిటన్ చాన్సలర్ ఆఫ్ ఎక్స్చెకర్ పోస్టులో నియమించారు. ఆ తర్వాత బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు. కరోనా లాక్డౌన్ కాలంలో రిషి ప్రకటించిన ఆర్థిక సహకార ప్యాకేజీలు బ్రిటన్ సామాన్యులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. దీంతో ఆయన బోరిస్ కంటే ఎక్కువ ప్రజాదరణ సంపాదించారు.
సులువేమీ కాదు..
బ్రిటన్ తదుపరి ప్రధాని రేసులో భారత సంతతి వ్యక్తి రిషి సునక్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ ఆ పదవిని దక్కించుకోవటం అంత సులువేమీ కాదు. కొత్త ప్రధాని ఎన్నిక వచ్చే అక్టోబర్లో జరుగనున్నది. పార్లమెంటులో కన్సర్వేటివ్ పార్టీకి మెజారిటీ ఉన్నది కాబట్టి ఆ పార్టీ అధ్యక్షుడే దేశ ప్రధాని అవుతారు. అందుకోసం ముందుగా కన్సర్వేటివ్ పార్టీ నాయకత్వానికి ఎన్నికలు జరుగుతాయి. ఆ పార్టీ ఎంపీలంతా కలిసి నాయకుడిని ఎన్నుకొంటారు. అధ్యక్ష పదవికి పోటీ పడే ఎంపీని మరో 8 మంది ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఎక్కువ మంది ఎవరికి మద్దతిస్తే వారే పార్టీ నాయకుడవుతారు. అయితే, మొదటి దశలో ఎవరికీ మెజారిటీ రాకుంటే రహస్య ఓటింగ్ ద్వారా నాయకుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల ప్రక్రియను 1922 కమిటీ పర్యవేక్షిస్తుంది. ఈసారి ప్రధాని రేసులో దాదాపు డజన్ మంది పేర్లు వినిపిస్తున్నాయి. బ్రిటన్ అటార్నీ జనరల్ సుయెల్లా బ్రవెర్మన్, భారత సంతతికే చెందిన మరో ఎంపీ ప్రీతి పటేల్, రక్షణశాఖ కార్యదర్శి బెన్ వాల్లేస్, ఎంపీలు పెన్నీ మోర్డాంట్, టామ్ టుగెంధర్, విదేశాంగ శాఖ కార్యదర్శి జెరెమీ హంట్, ప్రస్తుత ఆర్థిక మంత్రి నదీమ్ జహావి, లండన్ మాజీ మేయర్, మాజీ మంత్రి నదీమ్ జైదీ తదితరులు రిషికి పోటీదారులుగా భావిస్తున్నారు. రిషి సతీమణి అక్షతామూర్తిపై పన్ను ఎగవేత ఆరోపణలు రావటం ఆయనకు ప్రధాని అవకాశాలను తగ్గించే సూచనలు కనిపిస్తున్నాయి.
హీరో నుంచి జీరోకు..
దశాబ్ద కాలంలో బోరిస్ జాన్సన్ బ్రిటన్లో హీరో నుంచి జీరో అయ్యారు. బ్రెగ్జిట్ ఉద్యమ నాయకుడిగా ప్రజల నీరాజనాలు అందుకొన్న ఆయన, బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల చరిత్రలో మార్గరేట్ థాచర్ తర్వాత అంతటి అత్యధిక మెజారిటీ సాధించిన నాయకుడిగా అసాధారణ ప్రజా మద్దతు సంపాదించుకొన్నారు. అదే సమయంలో అనేక తప్పులు చేసి తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. తప్పులు చేయటం క్షమాపణ చెప్పటం బోరిస్కు పరిపాటి అని విపక్షాలు ఎద్దేవా చేసేవి. 2012లో లండన్ మేయర్గా ఉన్న సమయంలో ఒలింపిక్స్ క్రీడలను విజయవంతంగా నిర్వహించి తన సమర్థతను నిరూపించుకొన్నారు. బ్రెగ్జిట్కు అనుకూలంగా రెఫరెండం తీర్పు వచ్చిన తర్వాత 2016లో ఏర్పడిన థెరిసా మే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆమె రాజీనామాతో 2019 జూలై 24న తొలిసారి ప్రధాని పగ్గాలు చేపట్టారు. ఆ ఏడాది డిసెంబర్ 12న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కన్సర్వేటివ్పార్టీకి ఆయన సభలో మూడి ంట రెండొంతుల మెజారిటీ సాధించిపెట్టారు. అయితే, ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి వివాదాల్లో చిక్కుకొని విమర్శలు ఎదుర్కొన్నారు.
వివాదాలకు కేరాఫ్
పార్టీ విరాళాల సొమ్ముతో తన ఇంటిని రినోవేషన్ చేసుకొన్నట్టు విమర్శలు ఎదుర్కొన్నారు. 2020లో కరోనా లాక్డౌన్ కొనసాగుతుండగా నిబంధనలకు వ్యతిరేకంగా ప్రధాని కార్యాలయంలోనే జాన్సన్ తన సన్నిహితులతో మందు పార్టీ చేసుకొన్నట్టు బయటపడటం దుమారం రేపింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఆయనకు జరిమానా విధించారు. ఈ వివాదం కొనసాగుతుండగానే ఓ రేపిస్టు ఎంపీని కీలక పదవిలో నియమించినట్టు బయటపడింది. కన్సర్వేటివ్ పార్టీకే చెందిన క్రిస్ పించర్ను పార్లమెంటులో ఆ పార్టీ డిఫ్యూటీ చీఫ్ విప్గా ప్రధాని నియమించారు. క్రిస్ పించర్పై చాలా కాలంగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ పబ్బులో ఆయన ఇద్దరు పురుషులను లైంగికంగా వేధించటంతో డిఫ్యూటీ చీఫ్ విప్ పదవితోపాటు పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. క్రిస్ నేరాలు తనకు తెలియదని ఈ నెల 2న జాన్సన్ ప్రకటించారు. క్రిస్ నేరాల గురించి ప్రధానికి ముందే తెలుసని బీబీసీ బయటపెట్టడంతో ఈ నెల నాలుగున బోరిస్ దేశానికి క్షమాపణ చెప్పారు. దీంతో ప్రధానిపై తనకు నమ్మకం పోయిందంటూ ఆర్థిక మంత్రి రిషి సునక్ మొదట రాజీనామా చేశారు. ఆ తర్వాత రెండురోజుల్లోనే 40 మంది వరకు వైదొలిగారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో జాన్సన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.