టెల్ అవివ్: ఇజ్రాయిల్పై ఇరాన్ మిస్సైళ్లతో దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ దాడుల్ని తిప్పికొట్టేందుకు బరాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్(Barak System)ను ఇజ్రాయిల్ వినియోగిస్తున్నది. మానవరహిత ఏరియల్ వాహనాలతో పాటు మిస్సైళ్లను కూడా ఆ బరాక్ సిస్టమ్ సమర్థవంతంగా అడ్డుకుంటోంది. ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్తో పాటు భారత్కు చెందిన డీఆర్డీవో కూడా ఆ సిస్టమ్ అభివృద్ధిలో పాత్ర పంచుకున్నది. ఇద్దరూ సంయుక్తంగా బరాక్ సిస్టమ్ను డెవలప్ చేశారు. వైమానిక ముప్పులను ఎదుర్కొనేందుకు దీన్ని తయారు చేశారు. యూఏవీలు, క్రూయిజ్ మిస్సైళ్లతో పాటు ఎయిర్బోర్న్ టార్గెట్లను బరాక్ సిస్టమ్ ఎదుర్కోగలదు.
బరాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఓ అత్యాధునిక వ్యవస్థ. షార్ట్ టు మీడియం రేంజ్ మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థను ఇజ్రాయిల్ డెవలప్ చేసింది. నౌకలను రక్షించుకునేందుకు దీన్ని అభివృద్ధి చేశారు. రేడార్ ద్వారా సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్ ను ఆ సిస్టమ్ రిలీజ్ చేస్తుంది. ఒకేసారి మల్టిపుల్ టార్గెట్లను అడ్డుకునే సామర్థ్యం బరాక్ సిస్టమ్కు ఉన్నది. బరాక్-8 మిస్సైల్ సిస్టమ్ను ఎంఆర్-సామ్ అని కూడా పిలుస్తారు. ఇజ్రాయిల్తో పాటు ఇండియాకు చెందిన డీఆర్డీవో దీన్ని సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఆ సిస్టమ్కు అవసరమైన డుయల్ ఫేస్ రాకెట్ మోటార్ లాంటి సంక్లిష్టమైన పరికరాలను డీఆర్డీవో డెవలప్ చేస్తున్నది.
ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో బరాక్ సిస్టమ్ను ఇండియా వాడింది. పాకిస్థాన్కు చెందిన ఫతా-2 మిస్సైళ్లను దీంతో అడ్డుకున్నారు. ఫతా మిస్సైల్తో ఢిల్లీని పాక్ టార్గెట్ చేసింది. అయితే హర్యానాలోని సిర్సాలో దాన్ని చిత్తు చేశారు. ఇజ్రాయిలీ మూలాలు ఉన్న బరాక్ సిస్టమ్తో హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైళ్లను కూడా ధ్వంసం చేయవచ్చు అని తెలుస్తోంది. ఇజ్రాయిలీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్లో ఐరన్ డోమ్ కీలకమైంది. దాంతో పాటు యారో మిస్సైల్స్ కూడా కీలకమైనవే. కానీ బరాక్ సిస్టమ్ వల్ల.. ఎలాంటి వైమానిక దాడినైనా తిప్పికొట్టవచ్చు. ఎయిర్క్రాఫ్ట్, క్రూయిజ్ మిస్సైళ్లు, సీ టు సీ మిస్సైల్స్, రాకెట్లు, బాలిస్టిక్ మిస్సైళ్లను బరాక్ సిస్టమ్ చిత్తు చేస్తుంది.