బసన్కుసు: కాంగోలో ఘోర ప్రమాదం జరిగింది. మొత్తం 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ లులోంగా నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదం నుంచి 55 మంది సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన 145 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదం గురించి కాంగో ప్రభుత్వం శుక్రవారం ప్రకటన చేసింది.
కాంగోలోని లిలాంగా నుంచి 200 మంది ప్రయాణికులు, లగేజీతో బయలుదేరిన పడవ.. మంగళవారం లులోంగా నదిలో మునిగిపోయింది. ఈక్వెటియర్ ప్రావిన్స్లోని బసన్కుసు పట్టణం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడంవల్లే ప్రమాదం జరిగిందని కాంగో అధికారులు నిర్ధారించారు.
కాంగోలోని ఈక్వెటియర్ ప్రావిన్స్లో రవాణా సదుపాయాలు సరిగా లేకపోవడంవల్ల ప్రజల ప్రయాణాలకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరే గత్యంతరం లేక పడవలను ఆశ్రయించాల్సి వస్తుంది. వాళ్లు డబ్బుల కోసం సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నా ప్రశ్నించే అవకాశం లేదు. అందుకే అక్కడ తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాగా, గత అక్టోబర్లో జరిగిన ఓ బోటు ప్రమాదంలో కూడా 40 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.