రమల్లా: అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం ఆకస్మికంగా పాలస్తీనాను సందర్శించారు. ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లోని రమల్లాలో పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్తో సమావేశమయ్యారు. పాలస్తీనాలోని గాజాలో ఆధిపత్యమున్న హమాస్కు ప్రత్యర్థి పార్టీ అయిన సెక్యులరిస్ట్ ఫతా చీఫ్ అబ్బాస్తో ఆయన చర్చలు జరిపారు. హమాస్ పాలిస్తున్న గాజా స్ట్రిప్పై నియంత్రణను పాలస్తీనా అథారిటీ తీసుకోవాలని ఇటీవల బ్లింకెన్ అన్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య ఈ దిశగా మంతనాలు జరిగినట్లు తెలుస్తున్నది.
కాగా, అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ ఆకస్మిక దాడుల్లో సుమారు 1400 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. హమాస్ ఉగ్రవాదులు వందలాది మందిని బంధీలుగా తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. గాజాపై బాంబులు కురిపిస్తున్నది. ఆసుపత్రులతోపాటు, శరణార్థుల శిబిరాలు కూడా ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో పాలస్తీనా ప్రజల మృతుల సంఖ్య పది వేలకు చేరింది.
మరోవైపు గాజాలో మానవతా సహాయ కార్యక్రమాల కోసం ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించడం లేదు. అయితే ఇజ్రాయెల్ దాడిలో పాలస్తీనా ప్రజల మరణాలు పెరుగడంపై ముస్లిం దేశాలు భగ్గుమంటున్నాయి. దీంతో ప్రాంతీయ యుద్ధానికి దారి తీయవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్కు అన్నింటా అండగా ఉన్న అమెరికా అన్ని వర్గాలతో చర్చలకు ప్రయత్నిస్తున్నది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ శుక్రవారం ఇజ్రాయెల్కు వెళ్లి ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కలిసి మాట్లాడారు. అలాగే భద్రతా కారణాల రిత్యా ఆదివారం రహస్యంగా వెస్ట్ బ్యాంక్లో పర్యటించి పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్తో సమావేశమయ్యారు.