King Charles | ఏడు దశాబ్దాలపాటు బ్రిటన్ను పాలించిన క్వీన్ ఎలిజిబెత్-2 గతేడాది సెప్టెంబర్లో మరణించిన విషయం తెలిసిందే. అనంతరం బ్రిటన్ తదుపరి రాజుగా ఛార్లెస్-3 బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే 6వ తేదీన బ్రిటన్ రాజుగా ఛార్లెస్-3 పట్టాభిషేకం జరగనుంది. ఛార్లెస్-3, కెమిల్లా దంపతుల అధికారికంగా జరగనున్న ఈ పట్టాభిషేక మహోత్సవంలో శతాబ్దాల సంప్రదాయానికి ఛార్లెస్ దంపతులు స్వస్తి పలకనున్నట్లు తెలుస్తోంది.
పట్టాభిషేకం సమయంలో రాజ దుస్తులను ధరించడం ఆనవాయతీగా వస్తోంది. రాజులు పట్టు వస్త్రాలను ధరించేవారు. అయితే ఈ సంప్రదాయాన్ని విడిచిపెట్టాలని ఛార్లెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజు దుస్తులకు బదులు ఆర్మీ యూనిఫాంలో పట్టాభిషేకానికి ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో పట్టాభిషేక కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఆ తర్వాతి రోజున విండ్సర్ క్యాజిల్లో కూడా పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి సామాన్యులను కూడా అనుమతించనున్నారు.