US Presidential Election | వాషింగ్టన్: 2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మరో భారత సంతతి వ్యక్తి నిలిచారు. రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిత్వం ఆశిస్తున్నట్టు ఏరోస్పేస్ ఇంజినీర్ హిర్ష్ వర్ధన్ సింగ్ ( Hirsh Vardhan Singh ) తాజాగా వెల్లడించారు. ఇప్పటికే అధ్యక్ష పదవికి భారత సంతతి వ్యక్తులు సౌత్ కరోలినా మాజీ గర్నర్ నిక్కీ హేలీ, వ్యాపారవేత్త వివేక్ రామస్వామి పోటీ పడుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. 38 ఏండ్ల హిర్ష్ వర్ధన్ సింగ్ గురువారం ట్విట్టర్లో పోస్టు చేసిన ఓ వీడియో సందేశంలో మాట్లాడుతూ తనను జీవితకాల రిపబ్లికన్గా పేర్కొన్నారు. హిర్ష్ వర్ధన్ 2020లో అమెరికా సెనేట్కు పోటీ చేసి ఓడిపోయారు.
అమెరికాకు వలస వెళ్లిన భారతీయ దంపతులకు జన్మించిన హిర్ష్ వర్ధన్ సింగ్.. 2009లో న్యూజెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్ పట్టా పొందారు.