కాబూల్, జూలై 2: సుమారు రెండు దశాబ్దాల తర్వాత అఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెనుదిరిగాయి. అల్ఖైదాను అంతం చేయాలనే లక్ష్యంతో అఫ్ఘాన్లో అడుగుపెట్టిన యూఎస్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) దళాలు.. గురువారం రాత్రి నాటికి పూర్తిస్థాయిలో నిష్క్రమించాయని అఫ్ఘానిస్థాన్ అధికారిక వర్గాల సమాచారం. సుమారు 2,500-3,500 యూఎస్ దళాలతో పాటు నాటో దళాలూ గురువారం రాత్రి కాబూల్కు 69 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాగ్రం వైమానిక స్థావరం నుంచి నిష్క్రమించినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. యూఎస్తో పాటు నాటో దళాలు ఇన్నాళ్లు బాగ్రం కేంద్రంగానే ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించాయి. సుమారు ఒక లక్ష మంది బలగాలకు ఆశ్రయం కల్పించే వసతులు ఇక్కడ ఉన్నాయి. అమెరికా దళాలు వెనక్కివెళ్తూ సైనికులు ఇన్ని రోజులు ఉపయోగించిన సామగ్రిని ఆ దేశ రక్షణ శాఖకు అందజేసినట్టు సమాచారం. దాని విలువ 1 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అఫ్ఘాన్ ప్రభుత్వం అంచనావేసింది.
స్వాగతించిన తాలిబన్లు
గతేడాది ఫిబ్రవరిలో అమెరికా, తాలిబన్ల మధ్య కుదిరిన దోహ ఒప్పందం మేరకు అమెరికా, దాని మిత్ర దేశాల దళాలు 2021 మే 1 నాటికి అఫ్ఘాన్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవాలి. అయితే జో బైడెన్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఈ గడువును ఈ ఏడాది సెప్టెంబర్ 11కు (జంట టవర్లపై దాడి జరిగి 20 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో) పెంచారు. ఈ ప్రక్రియలో భాగంగా జూన్ 8 నాటికి అఫ్ఘాన్లో ఉన్న సగం మంది సైనికులను అమెరికా వెనక్కి రప్పించింది. చివరగా మిగిలిన వారు గురువారం నిష్క్రమించారు. యూఎస్ బలగాల నిష్క్రమణను తాలిబన్ స్వాగతించింది. తాజా పరిణామాలతో రెండు దశాబ్దాల యుద్ధానికి తెరపడ్డట్టే అని ప్రపంచ దేశాలు భావిస్తున్నా తాలిబన్లు మళ్లీ తోక జాడిస్తే అఫ్ఘాన్ మళ్లీ ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఆ దేశంలోని 17 ప్రావిన్సులలోని 30 జిల్లాలను తాలిబన్లు నియంత్రణలోకి తెచ్చుకున్నారు.