న్యూఢిల్లీ: కృత్రిమ మేధ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక రాబోయే రోజుల్లో మనకు శృంగార సౌక్యాలను కూడా కల్పించనున్నది. ఏఐ ఆధారిత సెక్స్ రోబోలు(Sex Robots) .. నిజమైన లైంగిక భాగస్వామినలా వ్యవహరిస్తాయని గూగుల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా చేసిన మొహమ్మద్ గవాదత్ తెలిపారు. ఇటీవల ఆయన యూట్యూబ్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంపాక్ట్ థియరీ ఇంటర్వ్యూలో కృత్రిమ మేధ వల్ల కలిగే శృంగార భావాల గురించి ఆయన వెల్లడించారు.
శృంగార భాగస్వామి ఎలా మనల్ని రంజింప చేస్తారో.. ఆ రీతిలోనే ఏఐ ఆధారిత సెక్స్ రోబోలు కూడా మనల్ని థ్రిల్ చేస్తాయని గవాదత్ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. నిజమైన భాగస్వామితో ఎంత ఎంజాయ్ చేస్తామో.. ఆ స్థాయిలోనే సెక్స్ రోబోలు కూడా మనల్ని మైమరిపింప చేస్తాయట. వర్చువల్ రియాల్టీ హెడ్సెట్స్తో ఇలాంటి అనుభవాలు మనకు కలుగుతాయని గవాదత్ తెలిపారు. కృత్రిమ మేధ అభివృద్ధి చెందుతున్నా కొద్దీ.. నిజమైన, అవాస్తవిక బంధాల మధ్య వ్యత్యాసం తగ్గుతుందన్నారు. మనుషుల్లో ఉండే ప్రేమ, ఇతర భావాలకు సంబంధించిన ఎమోషన్స్ కనుమరుగవుతాయన్నారు.
యాపిల్ కంపెనీకి చెందిన విజన్ ప్రో, లేదా క్వెస్ 3 లాంటి ప్రత్యేకమైన హెడ్సెట్స్ తో మనుషులు కృత్రిమ రీతిలో సంభోగ ఆనందాన్ని పొందవచ్చు అని గవాదత్ అన్నారు. అయితే ఇలాంటి హెడ్సెట్స్తో ఏఐ ఆధారంగా.. నిజంగానే మనం సెక్స్ రోబోలతో ఇంటరాక్టె చేస్తున్నట్లు ఉంటుందన్నారు. ఒకవేళ ఏఐతో మనం మనుషుల ఎమోషన్స్ను సృష్టించగలిగితే, అప్పుడు ఏది నిజమో, ఏది కాదో చెప్పడం కష్టమని ఆయన అన్నారు. టెక్నాలజీ నేరుగా మన మెదళ్లతో కనెక్ట్ అవుతుందని, దీని వల్ల మనం నేరుగా మనకు కావాల్సిన వ్యక్తితో మాట్లాడుతున్నామన్న భ్రమ కలుగుతుందన్నారు. ఇలాంటి సందర్భాల్లో మనకు నిజమైన భాగస్వామి అవసరం రాదు అని, అప్పుడు కృత్రిమ రీతిలోనే శృంగారాన్ని ఎంజాయ్ చేస్తామని ఆయన అన్నారు.
మానవ సంబంధాలు చాలా సంక్లిష్టమైనవి. ఆ సంబంధాలను అర్ధం చేసుకోవడం అంత సులువు కాదు. అయితే ఏఐలో ఉండే అడ్వాన్స్మెంట్.. మన మానసికమైన భావాలను చాలా సునాయాసంగా అంచనా వేయగలదన్నారు. స్నేహితులతో ఉన్నామా, ప్రేమలో ఉన్నామా అన్న విషయాన్ని అది చెప్పేయగలదని గవాదత్ తెలిపారు. రోబోలకు మనుషుల్లా ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటాయా అన్న ఆలోచనలు అవసరం లేదని, ఎందుకంటే ఏఐతో బలమైన బంధాన్ని ఏర్పర్చుకుంటే, అప్పుడు ఆ రిలేషన్ నిజమా, అబద్దామా అన్న భావన అవసరం లేదని గూగుల్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.
ప్రేమ, సంబంధాల గురించి ఏఐ చాలా విభిన్నరీతిలో ఆలోచిస్తుందని గవాదత్ తెలిపారు. టెక్నాలజీ మెరుగు అవుతున్నా కొద్దీ.. మనుషులు.. కృత్రిమ సంబంధాల మధ్య తేడాను గుర్తించలేమన్నారు. రాబోయే రోజుల్లో ఏఐ ఆధారిత భాగస్వామ్యలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. సమాజం వీటిని ఆమోదిస్తుందన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు.