లండన్ : గ్లాస్గోకు చెందిన ప్రముఖ చెఫ్, పాపులర్ డిష్ చికెన్ టిక్కా మసాలాను కనుగొన్నాడని భావించే అహ్మద్ అస్లాం అలి మరణించారని ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. 77 ఏండ్ల అహ్మద్ అస్లాం అలీ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారని అలీ మేనల్లుడు అంద్లీబ్ అహ్మద్ వెల్లడించారు.
అహ్మద్ అస్లాం అలీ మరణ వార్తను ఆయన పనిచేసే రెస్టారెంట్ శిష్ మహల్ ఫేస్బుక్ పేజీలో షేర్ చేయగానే పెద్దసంఖ్యలో ప్రజలు సంతాపం వ్యక్తం చేశారు. బ్రిటన్ జాతీయ వంటకాల్లో ఒకటైన చికెన్ టిక్కా మసాలా ఆవిష్కర్త భౌతికంగా దూరం కావడం బాధాకరమని పలువురు విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్లోనూ అలీకి నివాళులు అర్పిస్తూ నెటిజన్లు పెద్దసంఖ్యలో పోస్ట్ చేశారు.