బీజింగ్: కొండల్లో నిలువుగా కూలిన చైనా విమానంలోని 132 మంది మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. విమానం కూలిన వెంటనే భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అలాగే శకలాలు ఆ ప్రాంతంలో చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో విమానంలోని 9 మంది సిబ్బంది, 123 మంది ప్రయాణికులతో కలిపి మొత్తం 132 మందిలో ఎవరూ కూడా బతికే అవకాశాలు లేవని ఆ దేశ అధికారులు భావిస్తున్నారు.
చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 విమానం సోమవారం మధ్యాహ్నం 1.11 గంటలకు కున్మింగ్ నుండి గ్వాంగ్జౌకి బయలుదేరింది. సాయంత్రం 3.05 గంటలకు గమ్యస్థానం చేరాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం 2.22 గంటలకు రాడార్ నుంచి విమానం మాయమైనట్లు ఫ్లైట్ డేటా ద్వారా తెలిసింది. ఆ సమయంలో విమానం 29,100 అడుగుల ఎత్తులో ఉండి 376 నాట్ల వేగంతో ప్రయాణించినట్లు ఫ్లైట్ డేటా ప్రకారం అంచనా వేశారు. అనంతరం 2 నిమిషాల 15 సెకండ్లలో 26 వేల అడుగుల ఎత్తు కోల్పోయి 9,075 అడుగుల ఎత్తుకు చేరింది. మరో 20 సెకండ్లలో 3,225 అడుగుల ఎత్తుకు వచ్చి కిందనున్న కొండ ప్రాంతంలో నిటారుగా విమానం కూలింది.
వుజౌ నగరానికి సమీపంలోని గ్రామీణ ప్రాంతంలోని కొండల్లో విమానం కూలడంతో భారీగా అగ్నికీలలు, దట్టంగా పొగలు ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అధికారులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఆ విమానంలోని 123 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే వారంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు, ఆప్తులు ఆందోళన చెందుతున్నారు.
కాగా, విమానం కూలిన దుర్ఘటనపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దిగ్భ్రాంతి చెందారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఘటన నేపథ్యంలో ఆరేండ్ల నాటి బోయింగ్ 737-800 విమానాలను చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ నిలిపివేసింది. మరోవైపు చైనా విమాన ప్రమాదం కారణంగా సోమవారం అమెరికాలో బోయింగ్ సంస్థ షేర్లు భారీగా పతనమయ్యాయి. కాగా, చైనా విమానం నిటారుగా కూలిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Dash cam footage pic.twitter.com/w8iOzHblXE
— ChinaAviationReview (@ChinaAvReview) March 21, 2022