ఇస్లాబామాద్: తమ ప్రాంతంపై ఇరాన్ దాడులను పాకిస్థాన్ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ రాయబారిని పాకిస్థాన్ బహిష్కరించింది. (Pakistan Expels Iran Ambassador) ప్రస్తుతం ఇరాన్ పర్యటనలో ఉన్న ఆ రాయబారిని పాకిస్థాన్కు తిరిగి రావద్దని పేర్కొంది. అలాగే ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఉన్న తమ రాయబారులను పాకిస్థాన్ వెనక్కి పిలిపించింది. ఉన్నత స్థాయి అధికారుల ఇరాన్ సందర్శనను కూడా రద్దు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్, పాకిస్థాన్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
కాగా, పాకిస్థాన్లోని బలూచ్ ప్రావిన్స్లో ఉగ్రవాదుల స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. జైష్-అల్-అదల్ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై దాడి చేసినట్లు మంగళవారం తెలిపింది. అయితే ఇరాన్ దాడులను పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో ఇద్దరు పిల్లలు మరణించగా మరో ముగ్గురు బాలికలు గాయపడ్డారని వెల్లడించింది. పాకిస్థాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఇరాన్ దాడి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని పాకిస్థాన్ హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్న సంకేతంగా దీనిని భావిస్తున్నారు.