ISIS: ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS-ఐసిస్)’ ఉగ్రవాద సంస్థ ఆఫ్రికా దేశాల్లో తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకుంటోంది. ఏటికేడు కొత్త స్థావరాలను ఏర్పాటు చేసుకుంటోంది. ఏండ్లుగా ఆకలితో అలమటిస్తూ అల్లకల్లోలంగా మారిన పశ్చిమ ఆఫ్రికా దేశాలు ఇప్పుడు ఐసిస్కి అనువైన గమ్యస్థానాలయ్యాయి. ఐసిస్ కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి.
ప్రస్తుతం పశ్చిమాఫ్రికా దేశాలు పేదరికం, ఆకలితోపాటు అంతర్యుద్ధంతో తల్లడిల్లుతున్నాయి. నైగర్, మాలి, బుర్కినాఫాసో లాంటి పశ్చిమాఫ్రికా దేశాలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తమకు అనుకూలంగా మార్చుకుని స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
పశ్చిమాఫ్రికా దేశాల్లో నెలకొన్న రాజకీయ అస్థిరతతోపాటు, అక్కడ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద స్థావరాలు పెరుగుతుండటం ముప్పుగా పరిణమించిందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఐసిస్ ఉగ్రవాదులు పశ్చిమాఫ్రికాలో స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఇతర దేశాల్లో దాడులకు కుట్రలు చేస్తున్నారని నిఘా వర్గాల ద్వారా తెలిసిందని పేర్కొంది.