న్యూయార్క్: అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మసాచుసెట్స్ రాష్ట్రంలోని వారి ఇంట్లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. మృతుల్ని రాకేశ్ కమల్ (57), ఆయన భార్య టీనా (54), కుమార్తె అరియానా (18)గా గుర్తించామని నోర్ఫోక్ జిల్లా అటార్నీ (డీఏ) మైఖేల్ మోరిస్సే తెలిపారు.
ఈ ఘటనకు ‘గృహ హింస’ కారణమై ఉండవచ్చని ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు చెప్పారు. రాకేశ్ మృతదేహం వద్ద తుపాకీ లభించిందని, ఈ ఘటనలో బయటి వ్యక్తుల ప్రమేయం ఉందని చెప్పేందుకు ఆధారాలు లభ్యం కాలేదని అధికార యంత్రాంగం వెల్లడించింది. రెండు రోజులుగా వారి నుంచి ఎలాంటి స్పందనా లేకపోవటంతో బంధువు ఒకరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూస్తే అక్కడ ముగ్గురి మృతదేహాలు కనపడ్డాయి. రాకేశ్ కమల్ దంపతులు 19 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన విలాసవంతమైన భవనాన్ని 2019లో కొనుగోలు చేశారు. ఆర్థిక సంక్షోభం కారణంగా వారి కంపెనీ 2021 తర్వాత మూతపడింది.