మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చావును కోరుతూ ఆయన తల్లిదండ్రుల సమాధులపై ఓ మహిళ లేఖ రాసిపెట్టడం ఆ దేశమంతటా సంచలనం రేపింది. కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉండే శ్మశాసనంలోకి అందరి కళ్లుగప్పి ఓ మహిళ వెళ్లడం, ఏకంగా దేశాధ్యక్షుడికి వ్యతిరేకంగా అతని తల్లిదండ్రుల సమాధుల మీదనే లేఖ రాసి పెట్టడం కలకలం సృష్టించింది. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న రష్యా అధికార యంత్రాంగం కొన్ని గంటల వ్యవధిలోనే నిందితురాలిని గుర్తించి అరెస్ట్ చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. రష్యాకు చెందిన ఇరినా త్సబనెవా (60) అనే మహిళ ఈ నెల 6న భద్రతా సిబ్బంది కళ్లుగప్పి కట్టుదిట్టమైన భద్రతలో ఉండే సెరాఫిమోవ్స్కోయ్ శ్మశానంలోకి ప్రవేశించింది. ఆ శ్మశానంలో దేశాధ్యక్షుడు పుతిన్ తల్లిదండ్రుల సమాధుల వద్దకు వెళ్లి వాటిపై ఒక లేఖను రాసిపెట్టింది. పుతిన్ ఒక దుష్టుడు, హంతకుడు అని, ప్రపంచమంతా అతని చావు కోసం ప్రార్థిస్తున్నదని ఆ లేఖలో పేర్కొన్నది. అంతేగాక వరుస హత్యలకు పాల్పడుతున్న ఒక హంతకుడి తల్లిదండ్రులారా మీ కొడుకును మీ దగ్గరికి తీసుకెళ్లండి అని వేడుకుంది.
శ్మశాసనం సెక్యూరిటీ సిబ్బంది ఆ లేఖను గమనించి వెంటనే రష్యా లా ఎన్ఫోర్స్మెంట్కు పంపారు. దాంతో రంగంలోకి దిగిన రష్యా భద్రతా సిబ్బంది.. సీసీ కెమెరాల్లోని ఫుటేజ్ ఆధారంగా నిందితురాలి గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా.. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం తనను కలచివేసిందని, యుద్ధంలో వేల మంది ప్రాణాలు పోతున్నాయని, అందుకే తాను ఆగ్రహం పట్టలేక అలా లేఖ రాశానని జడ్జి ముందు వ్యాఖ్యానించింది.
విచారణ పూర్తిచేసిన జడ్జి నిందితురాలిని నవంబర్ 8 వరకు గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించారు. నిర్బంధంలో ఉన్నన్ని రోజులు ఆమె ఇంటర్నెట్, మెయిల్, ఫోన్ వాడటానికి వీల్లేదని నిషేధం విధించారు.