సిడ్నీ: గత గురువారం మరణించిన క్వీన్ ఎలిజబెత్ 2 రాసిన రహస్య లేఖ ఒకటి ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఖజానా లాకర్లో ఉంది. అయితే ఈ లేఖను తెరిచి అందులో ఆమె ఏం రాశారో అన్నది చదివి తెలుసుకునేందుకు మరో 63 ఏళ్లు ఆగాల్సిందే. కామన్వెల్త్ దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్కు క్వీన్ ఎలిజబెత్ 2 అధినేత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తన జీవిత కాలంలో ఆస్ట్రేలియాను ఆమె 16 సార్లు సందర్శించారు.
కాగా, 1986 నవంబర్లో ఆస్ట్రేలియాలో పర్యటించిన సందర్భంగా క్వీన్ ఎలిజబెత్ 2, సిడ్నీ నగర ప్రజలనుద్దేశించి ఒక రహస్య లేఖ రాశారు. వందేళ్ల తర్వాత అంటే 2085లో సిడ్నీ నగర మేయర్కు అనువైన రోజున ఈ లేఖను తెరిచి అందులోని సందేశాన్ని ప్రజలకు తెలియజేయాలని లేఖ కవర్పై పేర్కొన్నారు. దానిపై ఆమె సంతకం కూడా చేశారు. అయితే క్వీన్ ఎలిజబెత్ ఈ లేఖలో ఏం రాశారో అన్నది ఆమె వ్యక్తిగత సిబ్బందికి కూడా తెలియదు. 1986 నుంచి ఈ రహస్య లేఖను ఒక గాజు పెట్టెలో ఉంచి సిడ్నీలోని చారిత్రక భవనంలోని ఖజానా లాకర్లో భద్రపరిచారు.
మరోవైపు క్వీన్ ఎలిజబెత్ 2 మరణాంతరం రాజుగా బాధ్యతలు స్వీకరించిన చార్లెస్ 3ని తమ దేశాధిపతిగా ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ ఆదివారం ప్రకటించాయి. అయితే క్వీన్ ఎలిజబెత్ను దేశాధినేత్రిగా తొలగించాలా అన్న దానిపై 1999లో ఆస్ట్రేలియాలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. కాగా, ఆ దేశ ప్రజలు క్వీన్ ఎలిజబెత్కు తమ మద్దతు తెలిపి ఈ రెఫరెండమ్ను ఓడించారు.