రియో డి జెనీరో: అదో సరస్సు. చుట్టూ ఎత్తయిన రాతి కొండలు. వాటిపై పచ్చని చెట్లు. అంతెత్తు నుంచి భారీగా జాలువారుతున్న జలధార. ఇలాంటి రమణీయమైన ప్రకృతి అందాలను ఎవరు మాత్రం చూడాలనుకోరు..!. అసలే వీకెండ్. ప్రాకృతిక సోయగాలను చూసి తరించాలని చాలా మంది వచ్చారు. బోట్లలో తిరుగుతూ చుట్టూ ఉన్న పచ్చదనాన్ని చూస్తు అంతా మైమరచిపోతున్నారు.
ఇంతలో ఓ పెద్ద రాతి పలక వచ్చి ఆ బోట్లపై పడింది. ఇంకేముంది విహారయాత్ర కాస్తా విషాధయాత్ర అయింది. ఇదంతా బ్రెజిల్లోని క్యాపిటోలియో రీజియన్లో ఫర్నస్ అనే సరస్సులో జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, 20 మంది తప్పిపోయారు. మరో 32 మంది గాయపడ్డారు.
వారంతం కావడంతో క్యాపిటోలియో రీజియన్లోని ఫర్నస్ సరస్సుకు భారీగా పర్యాటకులు వచ్చారు. అంతా బోట్లలో తిరుగుతూ జలపాతం సమీపంలోకి వెళ్లారు. అయితే ఒక్కసారిగా కొండ చరియలు విరిగి పడ్డాయి. అవి అమాంతం సరస్సులో ఉన్న మూడు బోట్లపై పడటంతో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది గల్లంతయ్యారని కల్నల్ ఎడ్గార్డ్ ఎస్తెవో తెలిపారు. ఈ ప్రమాదంలో 32 మంది గాయపడ్డారని చెప్పారు. గల్లంతైనవారికోసం గాలిస్తున్నామని వెల్లడించారు.