వాషిగ్టన్: అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం సృష్టించాయి. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని బేస్బాల్ స్టేడియం వెలుపల దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో నలుగురు మృతిచెందారు. వాషింగ్టన్లోని నేషనల్స్ పార్క్ బేస్బాల్ స్టేడియంలో శనివారం మ్యాచ్ జరుగుతున్నది. స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయింది. వాషింగ్టన్ నేషనల్స్, సాన్డియాగో జట్ల మధ్య ఆట ప్రారంభమయ్యింది. ఇంతలో స్టేడియం వెలుపల నుంచి కాల్పుల మోత ప్రారంభమయింది. దీంతో కొందరు ప్రేక్షలకు స్టేడియం నుంచి బయటకు పరుగులు తీశారు. ఆటగాళ్లు పిచ్ను వదిలి వెళ్లిపోయారు.
ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు మొత్తం 12 రౌండ్లు కాల్పులు జరిపారు. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దవాఖనకు తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. కాల్పుల ఘటనతో అధికారులు మ్యాచ్ను రద్దుచేశారు. కాల్పులకు తెగబడినవారికోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.