వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్ (Washington) కాల్పుల మోతతో దద్దల్లింది. వాషింగ్టన్లోని పోష్ ఏరియా అయిన కనెక్టికట్ అవెన్యూలో శనివారం మధ్యాహ్నం ఓ సాయుధుడు ఆటోమేటిక్ వెపన్తో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని, దవాఖానలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. బాధితుల్లో ఒక అమ్మాయి కూడా ఉన్నదని చెప్పారు.
కాగా, కాల్పులకు తెగబడిన వ్యక్తి కోసం ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపట్టారు. కనెక్టికట్ను పోలీసులు చుట్టుముట్టారు. దుండగుడు తప్పించుకుపోకుండా అక్కడ లాక్డౌన్ విధించారు. అపార్టుమెంట్లను జల్లడపడుతున్నారు. నిందితుడిని వీలైనంత తొందరగా పట్టుకుంటామని అసిస్టెంట్ పోలీస్ చీఫ్ స్టువర్ట్ ఎమర్మెన్ చెప్పారు.