ముంబై : 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడి కేసులో పాకిస్థాన్కు చెందిన తహవుర్ రాణా అనుమానితుడిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే చికాగోలో వ్యాపారవేత్త అయిన రాణా ప్రస్తుతం అమెరికా కస్టడీలో ఉన్నాడు . రాణా అప్పగింత విషయంలో అదనపు డాక్యుమెంట్లను జూలై 15వ తేదీ లోగా దాఖలు చేయాలని, ఆ తర్వాతే రాణా అప్పగింత ఉంటుందని లాస్ ఏంజిల్స్ మెజిస్ట్రేట్ జడ్జి జాక్వెలిన్ చూల్జియాన్ తన తీర్పులో తెలిపారు. 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడుల్లో సుమారు 160 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. పాకిస్థాన్లో పుట్టి కెనడాలో వ్యాపారం నిర్వహిస్తున్న రాణాను తమకు అప్పగించాలని ఇండియా 2018లో అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆ కేసును విచారించిన జడ్జి జాక్వెలిన్.. రాణాకు సంబంధించిన అదనపు డాక్యుమెంట్లు కావాలని అటార్నీ, ప్రాసిక్యూటర్లను కోరారు. అప్పటి వరకు రాణా .. ఫెడరల్ కస్టడీలో ఉంటారని జడ్జి ఆదేశించారు.
చిన్ననాటి స్నేహితుడు డేవిడ్ కోల్మాన్ హెడ్లీతో కలిసి రాణా.. పాక్ ఉగ్ర సంస్థ లష్కరేతోయిబాకు సహకరించినట్లు భారత్ ఆరోపించింది. హెడ్లీ, రాణాలు పాక్లో ఒకే స్కూల్లో చదివారు. చికాగాలో ఉన్న రాణా ఇమ్మిగ్రేషన్ సెంటర్తో పాటు ముంబైలో ఉన్న ఆఫీసును ఉగ్ర కార్యకలాపాల కోసం వాడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. హెడ్లీ వేసిన ఉగ్ర ప్రణాళిక గురించి రాణాకు తెలియదని ఆయన తరపు అటార్నీలు వాదించారు. హెడ్లీ ఓ మోసగాడు అని, అనేక సార్లు అతను అమెరికా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని రాణా లాయర్లు కోర్టుకు తెలిపారు. రాణా ప్రమేయం లేకుండానే అతన్ని పేరును హెడ్లీ వాడుకున్నట్లు ఆరోపించారు. కోర్టుకు విచారణకు హాజరైన రాణా ఇద్దరు కూతుళ్లు ఎటువంటి స్పందన ఇవ్వలేదు.