కీవ్: సుమారు 25,000 సైనికులు, 1100కుపైగా యుద్ధ ట్యాంకులను రష్యా నష్ట పోయిందని ఉక్రెయిన్ తెలిపింది. ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఉక్రెయిన్పై రష్యా యుద్ధం శుక్రవారం నాటికి 72వ రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో రష్యాకు జరిగిన నష్టం వివరాలను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి వెల్లడించారు. రష్యా ఇప్పటి వరకు 24,900 సైనికులు, 1,110 ట్యాంకులు, 199 యుద్ధ విమానాలను కోల్పోయిందని తెలిపారు. అలాగే 155 హెలికాప్టర్లు, 2,686 సైనిక వాహనాలు, 502 ఆర్టిలరీ వ్యవస్థలు, 1,900 ఇతర వాహనాలు, ఇంధన ట్యాంకులను రష్యా నష్టపోయిందని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఒక ట్వీట్ చేశారు.
మరోవైపు ఉక్రెయిన్పై దాడిని రష్యా కొనసాగిస్తున్నది. మరియుపోల్లోని అజోవ్స్టల్ స్టీల్ ప్లాంట్ వద్ద రెండో రోజు కూడా భీకర పోరాటం జరిగిందని బ్రిటన్ మిలిటరీ నిఘా సంస్థ పేర్కొన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. కాగా, తూర్పు ఉక్రెయిన్ నగరం క్రమాటోర్స్క్లో పెద్ద మందుగుండు సామగ్రి డిపోను తమ క్షిపణులు ధ్వంసం చేశాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే తూర్పు లుహాన్స్క్ ప్రాంతంలో రెండు ఉక్రేనియన్ యుద్ధ విమానాలు, ఒక ఎస్యు-25, మిగ్ -29లను తమ వైమానిక దళం కూల్చివేసినట్లు పేర్కొంది.
కాగా, పోలాండ్ కూడా తమకు ముప్పుగా మారుతున్నదని రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ శుక్రవారం ఆరోపించారు. ఆ దేశం వ్యాఖ్యలు శృతి మించుతున్నాయని విమర్శించారు. రష్యాపై ఆంక్షలను మరింత కఠినం చేయాలని పోలాండ్ పిలుపునిచ్చింది. అలాగే ఉక్రెయిన్కు ఆయుధాలు అందించాలని నాటోను ఆ దేశం కోరడం రష్యాకు ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నది.