కీవ్ : ఉక్రెయిన్లోని నాలుగు భాగాలను రష్యా స్వాధీనం చేసుకోనున్నది. దీనిపై ఇవాళ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నది. దీనికి ముందు జాపోరిజ్జియా నగరంలో కాన్వాయ్పై రష్యా బాంబు దాడి చేసినట్లు సమాచారం. రష్యా దాడిలో కనీసం 23 మంది మరణించారని, 28 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్లోని జపోరిజ్జియాతో సహా నాలుగు ప్రాంతాలను రష్యాలో చేర్చడంపై ప్రజాభిప్రాయ సేకరణ జరగ్గా.. నేడు అవి అధికారికంగా రష్యాలో విలీనం కానున్నాయి. అయితే, బాంబు దాడి జరగడానికి కారణాలు తెలియరాలేదు. ఫిబ్రవరి 24 నుంచి రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుండగా.. ఇప్పటి వరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
రష్యా ఇప్పటివరకు ఉక్రెయిన్లోని చాలా ప్రాంతాలను రష్యా ఆక్రమించింది. డొనెట్స్క్, లుహాన్స్క్ (తూర్పు ఉక్రెయిన్), ఖెర్సన్, జపోరిజ్జియా (దక్షిణ ఉక్రెయిన్) రష్యాలో విలీనం కానున్నాయి. ఈ నాలుగు ప్రాంతాల్లో ఉక్రెయి భూభాగంలో 15శాతం ఉన్నాయి. శుక్రవారం నాలుగు ప్రాంతాలు రష్యాలో చేరుతాయని రష్యా పార్లమెంట్ ప్రధాన కార్యాలయం క్రెమ్లిన్ తెలిపింది. క్రెమ్లిన్లోని సెయింట్ జార్జ్ హాల్లో శుక్రవారం జరిగే వేడుకలో నాలుగు ప్రాంతాల అధిపతులు రష్యాలో చేరేందుకు ఒప్పందాలపై సంతకాలు చేస్తారని పెస్కోవ్ గురువారం విలేకరులతో తెలిపారు.
ఫిన్లాండ్ రష్యన్ పర్యాటకులు దేశంలో పర్యటించకుండా నిషేధం విధించింది. శుక్రవారం నుంచి నిషేధం అమలులో ఉంటుందని ఫిన్లాండ్ ప్రభుత్వం పేర్కొంది. రష్యాతో సరిహద్దులో ప్రయాణీకుల కదలికను పరిమితం చేస్తామని ప్రభుత్వం తెలిపింది. పర్యాటక వీసాపై వచ్చే రష్యన్ పౌరులపై నిషేధం ఉంటుందని, రష్యా పర్యాటకులను పూర్తిగా నిషేధించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రి పెక్కా హవిస్టో తెలిపారు.