Indians Deported : తమ దేశంలో ఉంటూ, నిబంధనలు పాటించని విదేశీయుల్ని ఆయా దేశాలు బహిష్కరించడం సహజమే. అలాగే విదేశాల్లో ఉంటున్న భారతీయుల్ని కూడా అక్కడి నిబంధనలు పాటించకుంటే బహిష్కరించి, తిరిగి పంపిస్తారు. ఇలా గతేడాది ఏకంగా వివిధ దేశాల నుంచి 22,900 మంది భారతీయుల్ని ప్రపంచ దేశాలు బహిష్కరించాయి. దీనికి సంబంధించి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ తాజాగా పార్లమెంట్లో ఒక నివేదిక విడుదల చేసింది.
2025లో విదేశాల నుంచి 22,900 మంది భారతీయులు బహిష్కరణకు గురైనట్లు కేంద్రం వెల్లడించింది. అయితే, ఎక్కువ మంది అనుకునేటట్లు ఇండియన్స్ను ఎక్కువగా తిరిగి పంపించిన దేశం అమెరికా కాదు. సౌదీ అరేబియా నుంచి ఎక్కువ మంది ఇండియన్స్ గతేడాది బహిష్కరణకు గురయ్యారు. ఇందులో జెద్దా నుంచి ఏకంగా 8,921 మంది, జెద్దా నుంచి 4,335 మంది ఒక్క ఏడాదిలోనే బహిష్కరణకు గురై తిరిగి ఇండియాకు వచ్చేశారు. ఆ తర్వాత యూఏఈ నుంచి ఎక్కువ మందిని బహిష్కరించారు. వీరిలో 7,896 మంది భారతీయులు దుబాయ్ నుంచి, 1,662 మంది అబుదాబి నుంచి డిపోర్ట్ అయ్యారు. ఎక్కువ మంది డ్రీమ్ కంట్రీ అమెరికా నుంచి గతేడాది 3,806 మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాతి స్థానాల్లో మలేసియా నుంచి 1,675 మంది, మయన్మార్ నుంచి 1,065 మంది, సింగపూర్ నుంచి 300 మంది, మాల్దీవ్స్ నుంచి 150 మంది, యూకే నుంచి 70 మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యారు.
ఇలా తిరిగొచ్చిన భారతీయుల్లో అత్యధికులు విదేశాలకు వెళ్లేముందు తమ ఏజెంట్లకు సగటున ఒక్కొక్కరు రూ.50 లక్షల వరకు చెల్లించుకున్నారు. కొందరు ఆస్తులు అమ్మడం, తనఖా పెట్టడం చేసి మరీ వెళ్లారు. అయితే, తప్పుడు వీసాలు, సరైన ధృవపత్రాలు లేకపోవడం, అక్కడి నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాల వల్ల ఆయా దేశాలు భారతీయుల్ని తిరిగి ఇండియాకు పంపించేశాయి. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం బాధితులకు అవసరమైన సాయం అందిస్తుందని ప్రభుత్వం తెలిపింది.