ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ఖాన్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయినా కూడా తన మీడియా టీమ్ను పిలిచి మీటింగ్ పెట్టడంపై ప్రతిపక్షాలతోపాటు ప్రజలు కూడా ప్రధానిపై విమర్శలు గుప్పిస్తున్నారు. చైనా వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజుల తర్వాత గత శనివారమే ఆయన కరోనా బారిన పడ్డారు. అదే రోజు ఆయన భార్య బుష్రా బీబీకి కూడా కరోనా సోకినట్లు తేలింది. ప్రధాని సమావేశానికి సంబంధించిన ఫొటోను పాక్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ షిబ్లీ ఫరాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే విమర్శలు వెల్లువెత్తాయి.
తన ఇంట్లోని గదిలో కాస్త దూరంగా కూర్చొని మీడియా టీమ్లోని ఐదుగురితో ఇమ్రాన్ మాట్లాడారు. సాక్షాత్తూ ప్రధానే కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఆ మీటింగ్కు హాజరైన అందరిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్లో కరోనా మూడో వేవ్ ఆందోళన కలిగిస్తోంది. ఏ ప్రభుత్వ అధికార ప్రతినిధి కూడా ఇమ్రాన్ ఖాన్ సమావేశాన్ని సమర్థించకపోవడం గమనార్హం. అటు ప్రజలు కూడా ఇలా వ్యక్తిగతంగా సమావేశం నిర్వహించడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.