Lebanon : లెబనాన్ నుంచి యూరప్కు బయలుదేరిన శరణార్థుల పడవ ఒకటి సముద్రంలో శనివారం బోల్తా పడింది. ప్రమాద సమయంలో అందులో 234 మంది ఉన్నారు. రాజధాని బీరెట్కు ఉత్తరం వైపున్న సెలాట మున్సిపాలిటీ పరిధిలోని సముద్రంలో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలియగానే లెబనాన్లోని ఐక్యరాజ్య సమితి మధ్యంతర దళం (యూఎన్ఐఎఫ్ఐఎల్), లెబనాన్ నౌకాదళం సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ప్రమాదంలో 232 మందిని కాపాడామని, ఇద్దరు శరణార్థులు ప్రాణాలు కోల్పోయారని లెబనాన్ సైన్యం వెల్లడించింది. ఈ ప్రమాదంలో చనిపోయిన మహిళ, చిన్న పిల్లాడు ఇద్దరూ సిరియాకు చెందిన వాళ్లేనని ప్రాణాలతో బయటపడ్డవాళ్లు తెలిపారు. అయితే.. సామర్థ్యానికి మించి మంది ఎక్కడం వల్లనే పడవ బోల్తా పడినట్టు తెలిసింది.
సిరియాలోని పోర్టు సిటీ టార్టస్లో పోయిన ఏడాది సెప్టెంబర్లో పడవ ప్రమాదం జరిగింది. ఆ సంఘటనలో 34 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. సిరియాలో అంతర్యుద్ధం కారణంగా చాలామంది దేశం విడిచి వెళ్తున్నారు. ప్రమాదం అని తెలిసినా పడవల్లో భారీ సంఖ్యలో బయలుదేరుతున్నారు. ఈ క్రమంలో జరిగిన ప్రమాదాల్లో సముద్రంలోనే కొందరు జల సమాధి అవుతున్నారు.