కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లోని మదర్సాలో పేలుడు జరిగింది. ఈ సంఘటనలో 16 మంది మరణించగా సుమారు 24 మందికిపైగా గాయపడ్డారు. సమంగాన్ ప్రావిన్స్లోని అయ్బక్ నగరంలో బుధవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 16 మంది చనిపోగా పదుల సంఖ్యలో గాయపడినట్లు స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి. ఉత్తర ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతంలోని మదర్సాలో బాంబ్ బ్లాస్ట్ జరిగినట్లు తాలిబన్ అధికారులు తెలిపారు. పది మందికిపైగా విద్యార్థులు మరణించి ఉంటారని చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ నఫీ టాకోర్ కూడా ఈ పేలుడు సంఘటనను నిర్ధారించారు. అయ్బక్ నగరంలోని మదర్సాలో జరిగిన పేలుడులో పలువురు గాయపడినట్లు వెల్లడించారు. అయితే ఈ పేలుడులో 16 మంది మరణించినట్లు అయ్బక్ నగరానికి చెందిన డాక్టర్ తెలిపారు. మృతులంతా పిల్లలేనని చెప్పారు.
కాగా, గత ఏడాది ఆగస్ట్లో అమెరికా సైనికులు వైదొలగిన తరుణంలో తాలిబన్లు మెరుపు వేగంతో కాబూల్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసి మరోసారి పాలిస్తున్నారు. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్ ప్రజలను ఐఎస్ఐఎస్ లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నది. ఈ నేపథ్యంలో మసీదులు, మదర్సాల్లో ఇప్పటి వరకు జరిగిన పేలుళ్లలో వందల సంఖ్యలో సాధారణ ప్రజలు మరణించారు.