బల్కంపేట ప్రకృతి వైద్య చికిత్సాలయం దేశంలోనే గొప్పదని, దీనిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. రూ.10 కోట్ల వ్యయంతో బల్కంపేట ప్రకృతి చికిత్సాలయంలో ఓపీ బ్లాక్, వెయిటింగ్ హాల్, వైద్య పరీక్షల గదులు, పురుషులు, మహిళల చికిత్సల విభాగం, ఫిజియోథెరపీ రూమ్, ఆక్యుపంక్చర్ విభాగం, నాలుగు కాటేజీలు, డైనింగ్, యోగా హాలు పునర్నిర్మాణ పనులను శనివారం ఆయన స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. ఆయుష్ సేవలను జిల్లాలకూ విస్తరిస్తామని, అదేవిధంగా ఇక్కడి 10 ఎకరాల విస్తీర్ణంలో మరిన్ని వసతులు కల్పిస్తామని మంత్రి చెప్పారు. ప్రకృతి చికిత్సాలయంలో యోగ, ప్రాణాయామం ద్వారా భవిష్యత్లో తలెత్తే వ్యాధులను 80శాతం వరకు తగ్గించుకోవచ్చని చెప్పారు.
కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రి హరీశ్రావు, ఎంపీ కేశవరావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్రెడ్డి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు
అమీర్పేట్, ఏప్రిల్ 8 : మెరుగైన ప్రకృతి చికిత్సల కోసం రాష్ట్ర ప్రజలు బెంగళూరు, వైజాగ్, ఉత్తర భారతదేశాల వైపు చూడకుండా వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉత్తమ చికిత్సలను అందుబాటులోకి తెచ్చేందుకు బల్కంపేట ప్రకృతి చికిత్సాలయాన్ని అభివృద్ధి చేసినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. బల్కంపేట నేచర్క్యూర్ దవాఖానలో రూ.10 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక వసతులు, అభివృద్ధి పనులను శనివారం స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డితో కలిసి మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రారంభించారు.
కార్యక్రమానికి మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్రెడ్డి, సీఎస్ శాంతికుమారి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి, ఆయుష్ విభాగం కమిషనర్ ప్రశాంతి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ బల్కంపేట ప్రకృతి చికిత్సాలయంలో అందుబాటులో ఉన్న యోగా, ప్రాణాయామ విధానాలను సాధన చేయడం ద్వారా భవిష్యత్లో తలెత్తే వ్యాధులను 80 శాతం వరకు తగ్గించుకోవచ్చన్నారు. రాబోయే రోజుల్లో ప్రకృతి వైద్య సేవలను జిల్లాలకు కూడా విస్తరించే ఆలోచనను ప్రభుత్వం చేస్తోందని, వికారాబాద్, భూపాలపల్లి, సిద్దిపేటల్లో 50 పడకల ఆయుష్ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకు వస్తున్నామని వెల్లడించారు. దేశంలోనే గొప్పగా బల్కంపేట ప్రకృతి వైద్య చికిత్సాలయాన్ని తీర్చిదిద్దారంటూ మంత్రి హరీశ్రావును స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అభినందించారు.
సిబ్బంది సంఖ్య పెరిగేలా చూడాలి
మంత్రి తలసాని శ్రీనివాస్
బల్కంపేట ప్రకృతి చికిత్సాలయంలో వసతుల కల్పనకు పెద్దపీట వేసిన మంత్రి హరీశ్రావు అభినందనీయులని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. వికారాబాద్ అనంతగిరి ప్రాంతంలో జిందాల్ తరహాలో ప్రకృతి చికిత్సాలయాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని మంత్రి హరీశ్రావుకు విజ్ఞప్తి చేశారు. ప్రకృతి చికిత్సాలయంలో రెండు తెలుగు రాష్ర్టాల నుంచి వైద్యం కోసం సందర్శకులు వస్తున్నారని, మెరుగైన సేవల కోసం సిబ్బంది సంఖ్యను పెంచాలని మంత్రి హరీశ్రావును కోరారు.
కాలుష్యానికి దూరంగా ఉండేలా..
టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
ఇక్కడి ప్రకృతి చికిత్సాలయాన్ని వాహన కాలుష్యానికి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో అధికారులు రూపొందించిన పార్కింగ్ నిబంధనలకు అందరూ పాటించి సహకరించాలి. ఎంతటి వారైనా తమ వాహనాలను నిర్ణీత పార్కింగ్ స్థలంలోనే నిలపాలి. వయోధికులు, నడవ లేని వారి కోసం ప్రకృతి చికిత్సాలయ ప్రాంగణంలో బ్యాటరీ కారు సేవలు అందుబాటులో ఉంటాయి.
అభివృద్ధి అంశాల్లో రాజకీయం సరికాదు..
ఎంపీ కేశవరావు
బల్కంపేటలో ప్రకృతి చికిత్సాలయ ప్రారంభోత్సవం, అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమం.. ఈ రెండింటిలో ప్రకృతి చికిత్సాలయ ప్రారంభోత్పవానికే వెళ్లాలని నిర్ణయించుకున్నా. ప్రధానమంత్రి కార్యక్రమానికి సంబంధించి నాకు అందిన ఆహ్వాన పత్రాల్లో ఎక్కడా పార్లమెంట్ సభ్యుల పేర్లు లేకపోవడం సరైనది కాదు. గతంలో ప్రధాని అధికారిక కార్యక్రమాలకు సంబంధించి ఆయా రాష్ర్టాల సీఎంలతో పీఎంవో అధికారులు మాట్లాడేవారు. సమాచార లోపాలు తలెత్తకుండా చూసేందుకు అటువంటి సంప్రదాయం గతంలో ఉండేది. అయితే నాకు తెలిసినంత వరకు ఈ సారి అటువంటి సంప్రదాయం పాటించలేదు. ఏదేమైనా అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో రాజకీయం సరికాదు.