సిటీబ్యూరో, జూలై 19 (నమస్తే తెలంగాణ): డ్రైనేజీలు, మ్యాన్ హోళ్ల నుంచి మురుగును తొలగించే కార్మికులకు ‘యాప్’సోపాలు తప్పటం లేదు. మురుగు తొలగింపు పనుల వివరాలు, పనివేళలు, పని ప్రదేశానికి సంబంధించిన ఫొటోలను అప్లోడ్ చేయడానికి జలమండలి డీసిల్టింగ్ యాప్ను రూపొందించింది. ఈ యాప్లో నమోదు చేయడం ద్వారా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు సకాలంలో పూర్తిస్థాయిలో పరిష్కారం అయ్యాయో లేదో చూడటం సులభం అవుతుందనేది జలమండలి ఉన్నతాధికారుల ఆలోచన.
ఈ విధానాన్ని ఈ యేడాది ఏప్రిల్ నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. జూన్ నుంచి యాప్ వినియోగాన్ని తప్పనిసరి చేశారు. అయితే.. క్షేత్రస్థాయిలో జలమండలి అధికారుల నిర్లక్ష్యం కారణంగా మురుగు తొలగించే కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు జరిగే ప్రదేశంలో జలమండలి సూపర్వైజర్ లేదా వర్క్ ఇన్స్పెక్టర్, లైన్మెన్ అందుబాటులో ఉండి వివరాలన్నీ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ జలమండలి సిబ్బంది పని ప్రదేశానికి రాకుండానే మురుగు పనులు చేసే జెట్టింగ్ మిషన్ డ్రైవర్, హెల్పర్లనే వివరాలు యాప్లో నమోదు చేయాలని ఆదేశిస్తున్నట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు.
పెద్ద ప్రాజెక్టులకు మాత్రం ఎలాంటి నిఘా లేకుండా.. మురుగు పనులు చేసే తమను యాప్ పేరిట ఇబ్బందులు పెడుతున్నారని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. మురుగు తీసే కార్మికులంటేనే దాదాపుగా చదువురాని వారుంటారు. ఎంతోకొంత చదువు ఉన్నవాళ్లు ఆ పనికే రావడం లేదు. అలాంటి పరిస్థితుల్లో కార్మికులనే యాప్లో వివరాలు నమోదు చేసి, ఫొటోలు అప్లోడ్ చేయమంటుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా యాప్ నిర్వహణ పూర్తిగా పని దక్కించుకున్న గుత్తేదారులే చేయాలనే నిబంధన కూడా పెట్టినట్లు తెలుస్తున్నది. లేదంటే బిల్లుల్లో కోతలు విధిస్తామని చెప్తున్నట్లు సమాచారం.
ఏపీకే ఫైల్స్తో యాప్ ఇన్స్టాలేషన్..
మురుగు పనుల వివరాలను నమోదు చేసేందుకు జలమండలి రూపొందించిన యాప్ను ఏపీకే ఫైల్ రూపంలో సంబంధిత సిబ్బంది, గుత్తేదారులు, కార్మికులకు పంపిస్తున్నారు. ఆ ఫైల్లోని లింక్ను ఓపెన్ చేస్తే యాప్ ఇన్స్టాల్ అవుతుంది. ఏపీకే ఫైల్స్ రూపంలో ఎలాంటి డేటా, యాప్లు, ఆన్లైన్ సమాచారం పంచుకోవద్దని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలున్నాయి. కానీ జలమండలి వినియోగించే యాప్ ఏపీకీ ఫైల్ రూపంలో ఉండటం ఆందోళన కలిగిస్తున్నది.
దీనివల్ల సైబర్ అక్రమాలు జరిగే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే జలమండలి పరిధిలో పనిచేసే ట్యాంకర్లు, జెట్టింగ్ మిషన్లు, సిల్ట్ వాహనాలకు ఏవీటీఎస్ (ఆటోమెటిక్ వెహికిల్ ట్రాకర్ సిస్టం) ఉన్నది. దీని ద్వారా సంబంధిత వాహనం పనిప్రదేశానికి వెళ్లిందా? ఎంత సమయం పనిచేసింది అనే సమాచారం తెలుసుకోవచ్చు. కానీ తాజాగా తీసుకొచ్చిన యాప్ ద్వారా సమస్య పరిష్కారమైన ఫొటోలు కూడా పొందటం ద్వారా కచ్చితత్వాన్ని పొందవచ్చని ఉన్నతాధికారులు భావన.
సిబ్బంది కొరతా కారణమే..!
మరోవైపు సూపర్వైజర్లు లేదా వర్క్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు రిటైర్ అవుతుండటం.. వారి స్థానంలో కొత్తవారిని తీసుకోకపోవడంతో సిబ్బంది కొరత ఏర్పడుతున్నది. అది కూడా పని ప్రదేశంలో అందుబాటులో లేకపోవడానికి కారణం అవుతున్నది. మరోవైపు ఉన్నతాధికారుల ఆదేశాలను లెక్కచేయకుండా.. పని ప్రదేశానికి వెళ్లకుండా జెట్టింగ్ మిషన్ డ్రైవర్లు, హెల్పర్లనే యాప్లో నమోదు చేయమని చాలా ప్రాంతాల్లోని సిబ్బంది చెప్తుండటంతో ఇబ్బందులకు కారణం అవుతున్నది. దీనిపై జలమండలి జేఎండీ మయాంక్ మిట్టల్ను వివరణ కోరగా.. పని ప్రదేశంలో తమ సిబ్బంది తప్పనిసరిగా ఉంటారని తెలిపారు. ఒకవేళ లేనిపక్షంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి యాప్ నిర్వహణ సూపర్వైజర్లు, లైన్మెన్లే చూసుకోవాలని ఆదేశిస్తామన్నారు. ఏపీకే ఫైల్ విషయంలో కూడా పునరాలోచిస్తామని చెప్పారు.