కొండాపూర్, సెప్టెంబర్ 24: వర్క్ ఫ్రం హోం నుంచి.. వర్క్ ఫ్రం ఆఫీస్ కొనసాగేలా పలు సంస్థలు, ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఐటీ విభాగం చీఫ్ రిలేషన్ ఆఫీసర్ ఆత్మకూరి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నా రు. మాదాపూర్ ఐటీ కారిడార్లో శుక్రవారం నిర్వహించిన టుమారోస్ ఫెసిలిటీ మేనేజ్మెంట్, హైదరాబాద్ చాప్టర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కొన్ని రోజులుగా ఐటీ ఉద్యోగులు వర్క్ఫ్రం హోం నుంచి, వర్క్ ఫ్రం ఆఫీస్కే ఓటేస్తున్నారని, సంస్థలు సైతం ఆఫీసులో విధులకు మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు దిగ్గజ సంస్థల ఉద్యోగులు విధులను సంస్థల నుంచే నిర్వహిస్తుండగా, మిగతా సంస్థలు సైతం అదే మార్గంలో ముందుకు సాగేలా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ముందుకు సాగుతున్నామన్నారు. ట్రాఫిక్ విషయాలలో సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఉద్యోగులు సొంత వాహనాలకు బదులుగా కార్ పూలింగ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించుకోవాల్సిందిగా తెలిపారు. దీంతో పాటుగా ఉద్యోగుల రాకపోకలు అధికంగా ఉండే మార్గాల్లో షటిల్స్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.