సిటీబ్యూరో, అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంత మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ షీ టీమ్స్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థ(సీఎస్ఐఆర్), సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అతివలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి.. వారు సొంతంగా వ్యాపారం చేసుకునే విధంగా అవకాశాలను కల్పించనున్నది. ఇందుకోసం సీఎస్ఐఆర్ వారు తమ వంతు సహకారంగా అవసరమయ్యే అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమయ్యారు.
గ్రామీణ మహిళలు వ్యాపారవేత్తులుగా ఎదిగేలా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు, రాచకొండ షీ టీమ్స్, సెక్యూరిటీ కౌన్సిల్ అధికారులు పలు గ్రామాలను ఎంచుకుని మహిళల్లో చైతన్యం కల్పించి వారిలో నైపుణ్యాన్ని పెంచి.. ఆసక్తి ఉన్న వారిని ఎంపిక చేస్తున్నారు.
పైలట్ ప్రాజెక్ట్ కింద రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని సంస్థాన్ నారాయణ్పూర్ గ్రామానికి చెందిన 100 మంది మహిళలను ఎంపిక చేశారు. శనివారం వారికి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా నిలదొక్కుకుంటే ఆ కుటుంబం ఎంత బలంగా స్థిరపడుతుందో వివరించారు. మహిళలు తమకు ఉన్న తెలివి తేటలతో వ్యాపారాన్ని అతి సులభంగా విస్తరించుకోవడంతో పాటు మరో 10 మందికి కల్పించే స్థితికి చేరుకోవచ్చని ప్రతినిధులు తెలిపారు.
ఎరువులు, మాస్కుల తయారీతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న వస్తువులకు సంబంధించి చిన్న చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేలా పోలీసులతో పాటు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు సహాయం చేస్తామని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంత మహిళలు ముందుకు వచ్చి వ్యాపారవేత్తలుగా ఎదగాలని ‘షీ టీమ్స్’, ‘సీఎస్ఐఆర్’, సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధులు ఆకాంక్షించారు.