HCA: మహిళా క్రికెటర్లపట్ల కోచ్ విద్యుత్ జయసింహ అసభ్యంగా ప్రవర్తించారు. దీనిపై మహిళా క్రికెట్ర్లు గత నెల 12న ఫిర్యాదు చేశారు. మెయిల్ ద్వారా హెచ్సీఏకు తమ ఫిర్యాదును పంపించారు. తమతో బస్సులో ప్రయాణిస్తూ కోచ్ జయసింహ మద్యం సేవించారని, అనంతరం తమను అసభ్య పదజాలంతో దూషించారని మహిళా క్రికెటర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
నెల రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళ క్రికెటర్ల ఫిర్యాదుతో కోచ్ జయసింహపై హెచ్సీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై విచారణకు ఆదేశించింది. కోచ్ పదవి నుంచి జయసింహ తక్షణమే తప్పుకోవాలని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు ఆదేశించారు. మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. మహిళా క్రికెటర్ల కోచ్ విద్యుత్ జయసింహను తక్షణమే సస్పెండ్ చేస్తున్నామని హెచ్సీఏ అధ్యక్షుడు ప్రకటించారు.
ఘటనపై విచారణ ముగిసే వరకు జయసింహపై సస్పెన్షన్ కొనసాగుతుందన్నారు. మహిళా క్రికెటర్ల ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపిస్తామని చెప్పారు. వేధింపులకు పాల్పడినట్లు రుజువైతే జయసింహపై క్రిమినల్ కేసులు పెడుతామని అన్నారు. మహిళా క్రికెటర్లకు హెచ్సీఏ అండగా ఉంటుందన్నారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను కోచ్ జయసింహ ఖండించారు.