సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఓ మహిళా కానిస్టేబుల్ దురుసుగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎల్బీనగర్ ప్రాంతంలో ఓ దవాఖాన యజమాన్యానికి సంబంధించిన భాగస్వాముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దవాఖానలో కార్తిక్, నరేశ్తో పాటు మరికొందరు భాగస్వాములు ఉన్నారు. వారి మధ్య మనస్పర్థలు రావడంతో భాగస్వాములు విడిపోయారు. నాలుగు రోజుల కిందట నరేశ్ తన అనుచరులతో దవాఖాన వద్దకు వెళ్లాడు. తమకు కోర్టు అర్డర్ ఉందని, తమ వారికి కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటారంటూ.. దవాఖానలో ఉన్న వారితో మాట్లాడారు.
వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఒకరు డయల్ 100కు ఫోన్ చేశారు. ఎల్బీనగర్ పోలీసులు వెళ్లారు. ఓ వ్యక్తి, ఓ మహిళ అక్కడకు వెళ్లిన వారిని ప్రశ్నించారు. మీరెవరు… మేం కమిషనర్కు చెప్పామన్నారు. ఈ నేపథ్యంలో ఓ మహిళా కానిస్టేబుల్ స్పందిస్తూ.. పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తే సరిపోతుందా….మేం కన్పించడం లేదా? అంటూ.. దురుసుగా మాట్లాడారు. కమిషనర్ వచ్చి డ్యూటీ చేస్తుందా…డయల్ 100కు ఫోన్ వస్తే మేం వచ్చామం’టూ కఠినంగా మాట్లాడటం చర్చనీయాంశమైంది. ఈ విషయమై ఎల్బీనగర్ పీఎస్ అధికారులతో మాట్లాడగా, గొడవ జరుగుతుందని పోలీసులు వెళ్లారని, అక్కడ జరిగిన విషయంపై సదరు వ్యక్తి చెప్పాడని.. ఆ విషయం అక్కడే సద్దుమణిగిందని చెప్పారు.