సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ): ఇతరుల పేరుతో లైసెన్స్ పొంది.. మెడికల్ దుకాణం నిర్వహించడమే కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా మందులు విక్రయిస్తున్న నిర్వాహకుడిని, అతడికి సహకరిస్తున్న మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రష్మి పెర్మాల్ కథనం ప్రకారం.. మారేడ్పల్లికి చెందిన ముతా కిశోర్ కుమార్ 20 ఏండ్లుగా సికింద్రాబాద్ రసూల్పురాలో మహావీర్ మెడికల్ షాప్ పేరుతో మందుల దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడికి ఎలాంటి అర్హతలు లేవు. మెడికల్ ఫీల్డ్పై అవగాహన లేదు. అయితే, అవినాశ్ బొల్లినేని అనే వ్యక్తి పేరుతో ఉన్న మందుల దుకాణాన్ని కిశోర్ కుమార్ నిర్వహిస్తున్నాడు. ఇందులో హెచ్1లో షెడ్యూల్డ్ చేసిన డ్రగ్ నిట్రావెట్, తదితర దగ్గు మందులను వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా, అతడి సహాయకుడు ముస్లం రాజ్తో కలిసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు.
కిశోర్ను అదుపులోకి తీసుకొని విచారించడంతో మెడికల్ రిప్రజెంటెటివ్గా పనిచేసే రమేశ్ గౌడ్ తమకు విక్రయిస్తున్నాడని వెల్లడించారు. రమేశ్ను అదుపులోకి తీసుకొని విచారించగా.. నకిలీ బిల్లులతో పీఎస్ గ్లోబల్ ఏజెన్సీ వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, కిశోర్కు విక్రయిస్తున్నట్లు వెల్లడించాడు. దీంతో కిశోర్, ముస్లం రాజు, రమేశ్ను పోలీసులు అరెస్టు చేశారు. దుకాణం రిజిస్ట్రేషన్లో పేరున్న బోలిశెట్టి అవినాశ్ పరారీలో ఉన్నట్లు డీసీపీ వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ.45 వేల విలువైన దగ్గు మందు టానిక్లు, వివిధ ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.