అంబర్పేట : అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ నల్లకుంట డివిజన్ ఫీవర్ దవాఖాన లేన్ వైపు వెళ్తుండగా మార్గమధ్యలో రోడ్డుపై చెప్పులు కుడుతున్న ఒక వృద్ధ మహిళను గమనించారు. ఆమె దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం నుండి పింఛను వస్తుందా? అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఏదైనా మంజూరైందా? అడగగా, పింఛను వస్తుంది కానీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రాలేదని ఆ వృద్ధురాలు చెప్పడంతో సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ఎవరిపై ఆధారపడకుండా జీవనాధారం కోసం తన వృత్తిని నమ్ముకొని కష్టపడుతున్న ఆమెను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని అండగా ఉంటానని తెలిపారు. ఈ సందర్భంగా స్వయంగా ఎమ్మెల్యే తనతో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం పట్ల ఆ వృద్ధ మహిళ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది.
ఈ కార్యక్రమంలో నల్లకుంట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మేడి ప్రసాద్, రాముయాదవ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.