వెంగళరావునగర్ : భార్య తనను వదిలి వెళ్లిందనే కారణంతో మనస్తాపం చెంది ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలను ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. మెదక్ జిల్లా శంకరంపేట మండలం, కొల్లపల్లి గ్రామం, గౌరీ శంకర్కాలనీకి చెందిన కమ్మని గురుచరణ్(34) కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తుండేవాడు.
ఈయనకు భార్య, ఇద్దరు పిల్లున్నారు. 14 సంవత్సరాల క్రితం మొదటి భార్యతో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. గత అయిదు సంవత్సరాల కిందట రేణుక అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెతో కూడా మనస్పర్తలు రావడంతో మూడు నెలల క్రితం భార్య ఇల్లు వదలి వెళ్లిపోయింది.
రెండో భార్య కూడా వెళ్లిపోవడంమతో తిరిగి ఆమెను వెతుక్కుంటూ సోమవారం ఎస్ఆర్ నగర్ లోని అంకమ్మబస్తీలో తన భార్య ఉన్నట్లు తెలుసుకుని వచ్చాడు. భార్యను తన వెంట ఇంటికి రావాల్సిందిగా కోరాడు. ఆమె రాక పోవడంతో… తన మిత్రుడి ద్విచక్ర వాహనం లో నుంచి పెట్రోలు తీసుకుని ఒంటి పై పోసుకుని నిప్పంటించుకున్నాడు.
దీంతో స్థానికులు మంటలను ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని చికిత్స నిమిత్తం గాంధీ దవాఖానాకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.