సిటీబ్యూరో, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : నాటకం సజీవమైనది. అందులోని పాత్రలు కండ్ల ముందే కదలాడుతుంటాయి. ఓ దశలో నవ్విస్తాయి… ఏడ్పిస్తాయి. హృదయాలను బరువెక్కిస్తాయి. బరువు దించుకున్నట్టుగా తేలికపరుస్తాయి. నాటిక ముగిసే సమయానికి ఓ చైతన్యం వీక్షకుడి మెదడులోకి చేరుతుంది. అందుకే నాటికలకు ఎప్పుడూ ఏ నాటికీ సినిమాలు సరితూగవు. థియేటర్ ఫెస్టివల్కు హైదరాబాద్లో విశేష ఆదరణ ఎప్పుడూ ఉంటుంది.
అభిమానుల కోసం ఈ వీకెండ్ను నాటికోత్సవంలోకి తీసుకెళ్లేందుకు ‘మనం థియేటర్’ సిద్ధమైంది. సందేశాత్మక నాటికలతో ఆకట్టుకునేలా థియేటర్ షోలను ప్రదర్శించేందుకు ‘మనం థియేటర్ ఫెస్టివల్’ ఆధ్వర్యంలో వీకెండ్ థియేటర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేటి నుంచి మరో రెండు రోజుల వరకు ఆసక్తికర థియేటర్ షోలను ప్రదర్శించనున్నారు.
హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థులతో రాజీవ్ వెలిచెటి దర్శకత్వంలో రూపొందిన ‘రెస్ట్ ఆఫ్ ద స్టోరీ’ శుక్రవారం రాత్రి 7:30గంటలకు గచ్చిబౌలిలోని రంగ్భూమి స్పేస్లో ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శన 75 నిమిషాల పాటు సాగనున్నది. ఆదివారం మాదాపూర్లోని డిస్ట్రిక్ట్ 150లో సాయంత్రం 4 గంటలు, రాత్రి 7:30 గంటలకు ‘అఫ్ఘనిస్తాన్ ఈజ్ నాట్ ఫన్నీ’పై నాటిక ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం 7032905332ను సంప్రదించాలని సూచించారు.