ముషీరాబాద్ : ముషీరాబాద్ డివిజన్ ఆదర్శకాలనీలో వారంరోజుల్లో మురుగునీటి పైపులైన్ నిర్మాణపనులు చేపట్టనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. వరద ఉధృతి తగ్గిన వెంటనే పైపులైన్ పనులు ప్రారంభించి సాధ్యమైనంత తొందరగా మురుగు నీటి లీకేజీ సమస్యకు పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన జలమండలి అధికారులతో కలిసి ఆదర్శనగర్లో పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా స్థానిక మహిళలు మురుగు నీటి లీకేజీతో ఇక్కట్లు పడుతున్నామని, వర్షం కురిస్తే లీకేజీ సమస్య అధికమవుతుందని ఫిర్యాదు చేశారు. త్వరితగతిన కొత్త పైపులైన్ ఏర్పాటు చేసి మురుగు నీటి సమస్య నుంచి తమ కాలనీకి విముక్తి కల్పించాలని కోరారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే ఇప్పటికే కొత్త పైపులైన్ ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేయడంతోపాటు పైపులు సైతం తెప్పించడం జరిగిందన్నారు.
మరో వారం రోజుల్లో పైపులైన్ ఏర్పాటు పనులు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం వాహబ్, మేనేజర్ వెంకటరమణ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు సాంబశివరావు, ముచ్చకుర్తి ప్రభాకర్, శ్రీధర్రెడ్డి, టీ.సోమసుందర్, లక్ష్మణ్ గౌడ్, బాల్రాజ్ గౌడ్, దీన్దయాల్రెడ్డి, శివముదిరాజ్, నర్సింగ్ ప్రసాద్, రజినీ, శ్రీకాంత్ గౌడ్, మచ్చెందర్ తదితరులు పాల్గొన్నారు.