ఓ మహిళా అధికారి ఆవేదన
ఖైరతాబాద్, జనవరి 29: ఇద్దరు అధికారుల వేధింపుల వల్లే తాను వీఆర్ఎస్ తీసుకుంటున్నట్లు అటవీ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా అధికారిణి ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఫారెస్టు కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న దండా జయలక్ష్మి సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 1987లో ఖమ్మం జిల్లాలోని పాల్వంచ డీఎఫ్ఓ కార్యాలయంలో తన మొదటి పోస్టింగ్ జరిగిందన్నారు. 2013లో భద్రాచలం నుంచి నిజామాబాద్ పారెస్ట్ సర్కిల్ ఆఫీస్ సూపరింటెండెంట్గా పదోన్నతిపై వెళ్లానన్నారు. అదే కార్యాలయంలో మేనేజర్గా పనిచేస్తున్న హేమలత ఉద్యోగ విరమణ పొందగా, ఇన్చార్జి మేనేజర్గా తనతో పాటు మరో సూపరింటెండెంట్ ఎమ్వీ రమణను తీసుకునే అవకాశం ఉండగా, అయితే, రమణపై గతంలో లైంగిక దాడి కేసు ఉండటం వల్ల మహిళా ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు తనను ఇన్చార్జి మేనేజర్గా నియమించారని జయలక్ష్మి అన్నారు. అప్పటి నుంచి తనపై పగ పెంచుకున్న ఎమ్వీ రమణ తనపై ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్)కు లేని పోని ఫిర్యాదులు చేయడం ప్రారంభించాడన్నారు. అదే విధంగా ఇన్చార్జి మేనేజర్గా ఉన్న తనను పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారిగా కూడా బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చిందని, ఆ క్రమంలో నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ తనపై లేనిపోని ప్రచారాలు చేసి తనను ఇన్చార్జి మేనేజర్ పదవీ నుంచి తప్పించి, ఎమ్వీ రమణను ఆ పదవీలో కూర్చోబెట్టి తనపై ఫిర్యాదు చేయించడం ప్రారంభించాడన్నారు. పీసీసీఎఫ్ ఇంటర్నల్ కైంప్లెంట్స్ కమిటీ చైర్ పర్సన్గా నియమితురాలైన ఆర్.శోభా తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి వర్క్ప్లేస్ హరాస్మెంట్ బాధితురాలిగా గుర్తించి మూడు నెలల పెయిడ్ లీవ్ ఇచ్చి, హైదరాబాద్లో పోస్టింగ్ ఇచ్చారన్నారు. అంతటితో ఆగకుండా ఎమ్వీ రమణ తనపై పెట్టిన 18 ఫిర్యాదులకు సంబంధించి విచారణ అధికారిగా డోబ్రియాల్ సైతం 2015 మే 5 నుంచి ఎంక్వయిరీ పేరుతో వేధింపులు మొదలు పెట్టాడన్నారు. సదరు అధికారులపై విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలని కోరారు.