చింపిరి జుట్టు, చిరిగిన బట్టలు.. బొక్కలు తప్ప కండ లేని మనుషులు. నడవడానికి కూడా ఓపికలేక నీరసించిన వ్యక్తులు. సరిగా కండ్లు కూడా కనిపించని ఒంటరి వృద్ధులు.. చిన్నారులను రోడ్డు పక్కన ఉన్న ఓ చెట్టు కింద నిద్దురింపజేయిస్తున్న దీన తల్లులు అక్కడక్కడ అందరికీ తారసపడుతుంటారు. వీరంతా అన్నం దొరకక పస్తులతోనే రాత్రులను దాటాలని ప్రయత్నిస్తుంటారు. ఇట్లాంటి వారి కడుపు నింపడానికి గ్రేటర్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. అందులో స్కై, ఆశ్రీ ఫౌండేషన్ మరో అడుగు ముందుకేసి.. ఎవరైనా ఆకలితో బాధపడే వారు ఉంటే కాల్ చేస్తే చాలు వారికి అన్నం అందించే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్, ప్యారడైజ్, తార్నాక, ట్యాంక్ బండ్, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లోనే కాకుండా ఎవరైన నిరాశ్రయులు కనిపిస్తే వారికి ఆహార ప్యాకెట్లు అందిస్తున్నారు.
“అది ప్యారడైజ్ ైఫె ్లఓవర్. రాత్రి 11:00. భారీ వర్షం కురుస్తున్నది. ఫ్లైఓవర్ కింద అక్కడక్కడ కొందరు వృద్ధులు, చిన్నారులు చలికి వణుకుతూ బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. దీనంగా చూస్తున్న వారిని చూసి ఓ వ్యక్తి తన దగ్గర ఉన్న వంద రూపాయలు తీసి వారికి అందించాడు. తిన్నారా.? అని అడిగాడు. లేదు బాబు అని చెప్పారు.. ఆ వ్యక్తి తనకు తెలిసిన ఓ నంబర్కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అంతే.. 40 నిమిషాల వ్యవధిలోనే ఆ అన్నార్తుల వద్దకు ఆహారం చేరుకుంది. వాళ్లు కడుపునిండా తిన్నారు.” నగరంలో ఇలాంటి సేవలందిస్తున్న ఆకలి తెలిసిన మనుషులకు అందరూ హ్యాట్సాప్ చెబుతున్నారు. మీకు ఎవరైనా నిరాశ్రయులు కనిపిస్తే సమాచారం ఇవ్వండి.. మేం వారికి అన్నం పెడుతామంటూ చెబుతున్నారు. ఒక్క కాల్ చేసి వివరాలు అందిస్తే చాలని అభయమిస్తున్నారు. – సిటీబ్యూరో, అక్టోబర్ 19
( నమస్తే తెలంగాణ )
– సంజీవ్ కుమార్, అధ్యక్షుడు, స్కై
ఆకలితో ఉన్నవాళ్లకు, అనాథలకు ఒక పూట అయినా ఆకలి తీర్చడం మనిషిగా మన బాధ్యత. పస్తులతో ఎవరూ బాధపడకూడదు. అన్నం దొరకక బాధపడుతున్న వారి సమాచారం మాకు అందిస్తే మేం వారికి ఆహార ప్యాకెట్లు అందజేస్తాం. ఇప్పటికే ప్రతి ఆదివారం అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమం కూడా తీసుకున్నాం. ఇప్పుడు మనకు కనిపిస్తున్న నిరాశ్రయులంతా ఒక్కప్పుడు వారి అమ్మానాన్నల గోరుముద్దలు తిన్నవాళ్లే కదా. పరిస్థితులు వారి జీవితాల్లో చీకట్లను తీసుకొచ్చాయి. వారికి కష్టాలను మిగిల్చాయి. సాటి మనిషికి సాయం అందించడంలోనే నిజమైన సంతోషం ఉంది.
-పూర్ణిమ కిశోర్ రెడ్డి, ఫౌండర్, ఆశ్రీ సొసైటీ
పట్టెడన్నం దొరకక పస్తులతో బాధపడుతున్న వారి ఆకలి తీర్చడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుంది. ఏదో ఒక ప్రాంతంలో అన్నదానం చేస్తూనే ఉంటాం. కానీ మనకు తెలియకుండా చాలా మంది పస్తులతో బాధపడుతుంటారు. అట్లాంటి వారికి కూడా మేం ఆహారం అందిస్తున్నాం. ఎవరైనా ఫుడ్ దొరకక పస్తులతో ఉన్నవాళ్లు కనిపిస్తే మాకు సమాచారం అందిస్తే చాలు మేం వారికి ఫుడ్ ఏర్పాటు చేస్తాం. దయచేసి మా ప్రయత్నాన్ని నీరుగార్చొద్దు. ఇటీవల కొందరు ఫోన్లు చేస్తే ఆహారం తీసుకెళ్లాం… కానీ అక్కడ నిరాశ్రయులు లేరు. మరికొందరూ ఫుడ్ ఏర్పాటు చేసుకునే వారైనప్పటికీ ఫుడ్ కోసం ఫోన్ చేశారు. ఇది నిరాశ్రయుల కోసం చేస్తున్న ప్రయత్నం. అందరూ సహకరిస్తే వారిని పస్తుల ఉండకుండా చేద్దాం.