కాచిగూడ : వికసిత్ భారత్ (Vikasit Bharat) అంటే అంబాని, ఆధాని కాదని,దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ బహుజనులను బాగుచేయడమేనని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య (R. Krishnaiah) అన్నారు. శుక్రవారం బీసీ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ వేలాది మంది బీసీలతో జూన్ నెలలో పార్లమెంట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న దాదాపు 30 లక్షల ఉద్యోగాలను కేంద్రం తక్షణమే భర్తీచేయాలని డిమాండ్ చేశారు. ఓబీసీలపై ఉన్న క్రిమిలేయర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ( BC Bill) పెట్టి చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించాలని, జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, కన్వీనర్ గుజ్జ కృష్ణ , కోలా జనార్ధన్, నందగోపాల్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.