రవీంద్రభారతి, అక్టోబర్ 20:మహర్షి వాల్మీకి ప్రవచనాలను విశ్వవ్యాప్తం చేయాలని, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని పలువురు వక్తలు కోరారు. బుధవారం రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంత్యోత్సవాన్ని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, రాష్ట్ర వినియోగదారుల చైర్మన్ గట్టు తిమ్మప్ప, జ్యోతిరావు పూలే రాష్ట్ర అధ్యక్షుడు గోపీవాల్మీకి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరై వాల్మీకి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఎమ్మెల్యే ముఠాగోపాల్ మాట్లాడుతూ నారాయణపేటను వాల్మీకి జిల్లాగా మార్చాలన్నారు. సీఎం కేసీఆర్ వాల్మీకి కులస్తుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని అన్నారు. జ్యోతిరావు పూలే రాష్ట్ర అధ్యక్షుడు గోపి మాట్లాడుతూ వాల్మీకిని ఆదర్శంగా తీసుకుని ప్రతిఒక్కరూ ఎదగాలన్నారు. కార్యక్రమంలో బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి మల్లయ్యబట్టు, ఎంబీసీ కార్పొరేషన్ సీఈవో, వాల్మీకి ఫెడరేషన్ ఎండీ అశోక్కుమార్, చంద్రశేఖర్, తిరుమలేశ్, కిష్టయ్య, విజయ్కుమార్, సువర్ణ లక్ష్మీనారాయణ, బాలకృష్ణ, పాల్గొన్నారు.