సిటీబ్యూరో/బడంగ్పేట, ఫిబ్రవరి 5: వనస్థలిపురంలో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన మరవక ముందే మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో అతివేగంగా దూసుకొచ్చిన టిప్పర్ మరొకరిని బలిగొంది. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ రోడ్డు ప్రమాదం జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. మీర్పేట ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథం కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా బూత్పూర్ మండలం మదిగట్ల గ్రామానికి చెందిన లక్ష్మమ్మ(52) తన కొడుకు, కోడలుతో కలిసి హస్తినాపురం సమీపంలోని అగ్రికల్చర్ కాలనీ వైపు వెళ్లారు. అక్కడ తెలిసిన వారి దగ్గర డబ్బులు తీసుకొని.. తిరిగి చంపాపేటకు బయలుదేరారు. కొడుకు, కోడలు వేరే వాహనంపై వెళ్లారు. మరో ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్లో తెలిసిన వారితో కలిసి లక్ష్మమ్మ వెళ్తోంది. ఇదే సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లక్ష్మమ్మ వెళ్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. వెనుక కూర్చున్న ఆమె కిందపడిపోయింది. టిప్పర్ ఆమె పైనుంచి వెళ్లడంతో మృతి చెందింది. మిగతా ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి.
వ్యాపారులు తమ బోర్డులతో రోడ్డును ఇరువైపులా ఆక్రమించుకోగా, మరో పక్క వాహనాలను పార్కింగ్ చేయడంతో రోడ్డంతా ఇరుకుగా మారింది. ఈ రోడ్డుకు డివైడర్ కూడా లేకపోవడంతో వచ్చిపోయే వాహనాలు ఇష్టానుసారంగా వెళ్తున్నాయి. ఇటీవల ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉన్నదని సీఎం, డీజీపీ స్థాయిలో ట్రై కమిషనరేట్ పోలీసులతో పాటు జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. దీంతో రోడ్లకు ఇరువైపులా అక్రమంగా ఉండే పార్కింగులను తొలగించడంతో పాటు విజుబుల్ పోలీసింగ్తో ట్రాఫిక్ను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.
జీహెచ్ఎంసీ అధికారులు వ్యాపారుల నుంచి నెలవారీ మామూళ్లకు అలవాటు పడటంతో గల్లీలు, రోడ్లపై చిరు వ్యాపారులు, బడా వ్యాపారులు తమ వ్యాపార బోర్డులను ఇష్టానుసారంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. జెడ్పీ రోడ్డులో ప్రమాదం జరిగిన చోట టీ అడ్డా అనే ఒక హోటల్ ఉంది. దీంతో అక్కడ వాహనాలు రోడ్డుకు ఒకపక్క పార్కింగ్ చేయగా.. మరోపక్క హోటల్ బోర్డు ఉంది. వెనుక నుంచి టిప్పర్ అతివేగంగా వస్తుండటంతో ద్విచక్ర వాహనదారుడు పక్కకు తీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, ఒక పక్కన హోటల్ బోర్డులు, వాహనాలు ఉండటంతో పక్కకు తీసుకునే ప్రయత్నం చేసినా అది సాధ్యం కాలేదు. ఇంతలోనే వెనుక నుంచి టిప్పర్ వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ట్రిపుల్ రైడింగ్ ఉండటంతో వెనుక కూర్చున్న లక్ష్మమ్మ జారి.. లారీ చక్రాల కింద పడి మరణించింది. ఈ ప్రమాదానికి జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం, ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమంటూ స్థానికులు మండిపడుతున్నారు.